
సౌథాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా.. రిజర్వ్ డే కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. విజేతగా నిలిచిన న్యూజిలాండ్కు 16 లక్షల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తో పాటు ఐసీసీ గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్మనీ దక్కింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నపళంగా మైదానం వెలుపలికి వెళ్లిపోయాడు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52 నాటౌట్: 89 బంతుల్లో 8x4), రాస్ టేలర్ (47 నాటౌట్: 100 బంతుల్లో 6x4) గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో భారత జట్టు వికెట్ కీపర్ని మార్చడంపై అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చి నాలుగు ఓవర్లు కీపింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ 26వ ఓవర్ నుంచి 30వ ఓవర్ వరకూ సాహా కీపింగ్ చేశాడు. దాంతో రిషబ్ పంత్కి ఏమైంది?, సాహా ఎందుకు కీపింగ్ చేస్తున్నాడు? అని విషయం తెలుసుకునేందుకు ఫాన్స్, నెటిజన్లు తెగ ఆరాటపడ్డారు. ఎట్టకేలకి పంత్ మైదానం వెలుపలికి ఎందుకు వెళ్లాడనే కారణంను ఐపీఎల్ ప్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. 'పంత్ ఒంట్లో నలతగా (అనారోగ్యం) ఉంది. అందుకే ఫైనల్లో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ చేశాడు' అని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. జట్టుకు కీలకమైన సమయాల్లో రాణించాడు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లోనూ 270 పరుగులు చేసి జట్టుకు తానెంత ముఖ్యమైన ఆటగాడనేది నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న పంత్.. జట్టును అద్భుతంగా నడిపించి లీగ్ ముగిసేసమానికి పాయిట్స్ టేబుల్ల్లో మెరుగైన స్థానంలో నిలబెట్టాడు.