
హైదరాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న యువ ఆటగాడు రిషబ్ పంత్పై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్లోకి వచ్చిన మొదట్లో తాను ఆడినట్టు ఆడుతున్నాడని, అప్పటి తన రోజులను ఇప్పుడు రిషబ్ పంత్ గుర్తు చేస్తున్నాడని రైనా పేర్కొన్నాడు.
అంతేకాదు రిషబ్ పంత్ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడని, టీమిండియాకు ఎక్కువ కాలం పాటు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'రిషబ్ పంత్ ఎంతో బాగా ఆడుతున్నాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. అతని ఆట తీరు నన్నెంతో ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పంత్ ఎలా ఆడుతున్నాడో.. నా కెరీర్ మొదట్లో నేను అలాగే ఆడేవాడిని' అని అన్నాడు.
రైనా, యువరాజ్ సింగ్ల కలయికే రిషబ్ పంత్ అని సచిన్ ఎప్పుడో ప్రశంసించాడని, సెహ్వాగ్ కూడా అతడి ఆటతీరును ఎంతగానో కొనియాడాడని రైనా ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 'గతంలో సచిన్, సెహ్వాగ్ పంత్ను పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని గుర్తు చేశాడు. రైనా, యువరాజ్ను కలిపితే పంత్ అని, పంత్ దేవుడిచ్చిన కానుక అని వారు అన్నారు. వారి మాటల్లో నిజం ఉంది' అని రైనా అన్నాడు.

'పదేళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. భగవంతుడి దయ వల్ల దొరికిన ఇటువంటి ఆటగాళ్లకు మరింత మద్దతు అవసరం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ, భవిష్యత్తులో టీమిండియా తరఫున ఎక్కువ కాలం పాటు క్రికెట్ ఆడే ఆటగాళ్లలో పంత్ తప్పనిసరిగా ఉంటాడు' అని రైనా వివరించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు తాను ఆడిన 13 మ్యాచ్ల్లో రిషబ్ పంత్ 620 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో పంత్ పలుమార్లు ఆరెంజ్ క్యాప్ ధరించాడు. గతవారంలో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేశాడు.