13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరపడింది. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా భారత్ అవతరించింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. పొట్టిఫార్మాట్లో భారత్కు ఇది రెండో ట్రోఫీ. 2007 టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా కప్ను అందుకుంది. 17 ఏళ్ల తర్వాత టీ20 కప్ను రోహిత్ సేన ఇప్పుడు అందుకుంది.
అయితే ఛాంపియన్గా నిలిచిన భారత ఆటగాళ్లకు ట్రోఫీతో పాటు మెడల్స్ అందించారు. ఈ క్రమంలో మెడల్ అందుకున్న పంత్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వాటిని అభిమానులతో పంచుకున్నాడు. ఈ మెడల్ మనల్ని కాస్త భిన్నంగా మార్చుతుందని అర్థం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా, పంత్ పోస్ట్కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫన్నీగా కామెంట్లు చేశారు.

'భాయ్.. అలాంటిదే మా దగ్గరా ఉంది' అని అక్షర్ పటేల్, సిరాజ్ కామెంట్లు చేస్తూ పంత్ను ట్రోల్ చేశారు. విజేతగా నిలిచినందుకు భారత ఆటగాళ్లందరికీ మెడల్స్ అందించారు. అయితే పంత్ దాన్ని ప్రత్యేకమైన క్యాప్షన్తో ప్రత్యేకంగా పోస్ట్ చేయడంతో అక్షర్, సిరాజ్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. కాగా, టీ20 వరల్డ్ కప్ గెలిచిన నాలుగు రోజుల తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్టులో వేచి ఉన్న అభిమానులు భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. టీమిండియా ఎయిర్పోర్ట్ నుంచి మొదట హోటల్కు చేరింది. అక్కడ కాసేపు సేద తీరిన అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి వెళ్లింది. విశ్వవేదికపై భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు.
మోడీ మీటింగ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు ముంబైకి బయల్దేరారు. ముంబైలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఊరేగింపు జరగనుంది. గతంలో ధోనీ సేన పాల్గొన్నట్లుగానే ఓపెన్ టాప్ బస్సులో ప్రపంచ కప్పుతో టీమిండియాకు అభిమానులకు అభివాదం చేయనుంది. అంతేగాక రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం జరగనుంది.