ధోనిని అధిగమించిన పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పదో స్థానానికి చేరుకున్నాడు. పదో స్థానానికి చేరుకున్న రిషబ్ పంత్ ఖాతాలో 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ 10లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించాడు. గతంలో మహేంద్రసింగ్ ధోని కూడా ఎప్పుడూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో చోటు సంపాదించలేదు. దీంతో ధోనిని అధిగమించి మరి పంత్ టాప్ 10లో చేరడం గమనార్హం. కాగా టీమిండియా టెస్టు జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి రిషబ్ పంత్ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలసిందే.

సూపర్ ఫామ్లో పంత్
రిషబ్ పంత్ ఇటీవల సూపర్ ఫామ్లో ఉన్నాడు. చివరి రెండు టెస్టు మ్యాచ్లో మంచి స్కోర్లు చేశాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో అజేయ సెంచరీ కొట్టిన పంత్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో 96 రన్స్ చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 40 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టాప్ 10లో ముగ్గురు
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో నిలిచారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 763 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా.. 761 రేటింగ్ పాయింట్లతో రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక 723 రేటింగ్ పాయింట్లతో రిషబ్ పంత్ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ రెండో స్తానంలో ఉన్నాడు.

బౌలర్ల జాబితాలో ఇద్దరు
ఇక ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో టాప్ 10లో ఇద్దరికి చోటు దక్కింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఖాతాలో 850 రేటింగ్ పాయింట్లు ఉండగా.. బుమ్రా ఖాతాలో 766 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా మొదటి స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు.


Click it and Unblock the Notifications












