హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై 2019లో జరగనున్న ప్రపంచకప్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఆడించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ఇంగ్లాండ్తో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (114) 146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సులు మెరుపు సెంచరీ బాదడంతో.. అతడ్ని ప్రపంచకప్లో ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ పిచ్లపై.. అదీ ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొని పంత్ సిక్సర్లు బాదడంతో ఈ డిమాండ్లకి బలం చేకూరింది. ధోనీ స్థానంలో పంత్కి ప్రపంచకప్లో ఛాన్సివ్వాలనే డిమాండ్పై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ 'ఒకవేళ ఇప్పటి నుంచి రిషబ్ పంత్ని వన్డేల్లో ఆడించినా.. 2019 ప్రపంచకప్లో మాత్రం మహేంద్రసింగ్ ధోనీనే ఆడించాలి. ఎందుకంటే.. పంత్కి అనుభవం తక్కువ.'
'దీనికితోడు వరల్డ్కప్లోపు అతను 15-16 వన్డేలు ఆడే అవకాశం లేదు. మరోవైపు ధోనీ ఇప్పటికే 300+ వన్డేలాడేశాడు. కాబట్టి వీరిమధ్య పోలిక కూడా సమంజసం కాదు. వ్యక్తిగతంగా ధోనీ ప్రపంచకప్ ఆడాలని నేను కోరుకుంటున్నా' అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.
అంతేకాదు 'క్రికెట్ కీ బాత్' అనే ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2011 ప్రపంచ కప్ విషయంలో ధోనీ బ్యాటింగ్యే కీలకమని చెప్పుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్ చెప్పడం వల్లనే గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ల అజేయమైన భాగస్వామ్యం భారత్కు రెండో ప్రపంచ కప్ను తెచ్చిపెట్టింది.