
ప్రమాదంలో గాయపడిన పంత్ కాళ్లు బాగా వాచిపోయినట్లు సమాచారం. దీంతో అతని కాళ్లకు తీయాల్సిన ఎంఆర్ఐ స్కాన్ను వైద్యులు వాయిదా వేశారు. ప్రస్తుతానికైతే పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతను స్పృహలో ఉన్నాడని మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. పంత్ కుడి చేయి, కాలుపై పలు గాయాలయ్యాయి, అలాగే నుదుటిపై, కంటికి సమీపంలో కూడా దెబ్బలు తగిలాయని వివరించారు. పంత్ వీపుపై కూడా గాయాలైనట్లు చెప్పారు. దీనిపై బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 'పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతుగా తెగింది. కుడి మోకాలికి తీవ్రమైన గాయమైంది. కుడి మణికట్టు వద్ద కూడా గట్టి దెబ్బ తగిలింది. ఇన్ని గాయాలైనా పంత్ పరిస్థితి బాగానే ఉంది. ఈ గాయాల తీవ్రత తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్లు చేసి తదుపరి చికిత్స అందిస్తాం' అని పేర్కొంది.
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని పంత్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. వేగంగా వెళ్తుండగా అతని కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కిటికీ అద్దం పగలడంతో దానిలో నుంచి బయట పడేందుకు పంత్ ప్రయత్నించాడు. ఆలోపే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక హరియాణా బస్సులో డ్రైవర్ సుశీల్ కుమార్.. తన బస్సును రోడ్డు పక్కన ఆపేసి కిందకు పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్ను పూర్తిగా బయటకు లాగి, ఒక బెడ్షీట్తో అతన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించాడు.