
హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొలుత తన బలాన్ని గుర్తించాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. తాజాగా ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "రిషబ్ పంత్ తన బలాలేమిటో ముందుగా అర్థం చేసుకోవాలి. అలా అయితే, ఒడిదొడుకుల్ని తట్టుకుని నిలబడగలడు" అని అన్నాడు.
"ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హిట్టింగ్ చేయాల్సిందిగా రిషబ్ పంత్కి సలహాలు వస్తున్నట్లు ఉన్నాయి. ఆ మేరకు అతడు భారీ షాట్లు ఆడుతున్నాడు" అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి పంత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్తో ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీ బాది టెస్టుల్లో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో వరుసగా 92, 92 పరుగులతో రిషబ్ పంత్ రాణించిన సంగతి తెలిసిందే. అనంతరం విండిస్తో జరిగిన వన్డేల్లో విఫలమయ్యాడు.
అయితే, టీ20ల్లో మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చెన్నై వేదికగా గత ఆదివారంతో ముగిసిన ఆఖరి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో కూడా పంత్ చోటు దక్కించుకున్నాడు. ధోని స్థానంలో టీ20ల్లోకి రిషబ్ పంత్ని సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.