
హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రానికి శనివారం తెరపడింది. గత రెండేళ్లుగా వన్డే, టీ20 జట్టులోకి వస్తూ పోతున్న రిషబ్ పంత్.. టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. కానీ, టెస్టు జట్టులోకి మాత్రం అతనికి పిలుపు రాలేదు.
2016-17 దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ 12 ఇన్నింగ్స్ల్లో 972 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత 2018 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ల్లో ఏకంగా 684 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. దీంతో సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన టెస్టు జట్టులో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా చోటు దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లోనూ బ్యాట్తో 0, 20, 1, 0 పరుగులతో దినేశ్ కార్తీక్ నిరాశపరిచాడు. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టుకి తుది జట్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
ఇందులో భాగంగా మూడో టెస్టు ప్రారంభానికి ముందు రిషబ్ పంత్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. దీంతో.. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడుతున్న 291 ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేసే రిషబ్ పంత్ దూకుడికి మారుపేరుగా గుర్తింపు పొందాడు.