టీమిండియా స్టార్ వికెట్ కీపర్, క్రికెటర్ రిషభ్ పంత్ తన మంచి మనసు చాటుకున్నాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేదలకు ఇస్తానని ప్రకటించాడు. యాడ్స్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయం అందిస్తానని వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపాడు పంత్. దీంతో అతడు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఓ ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు పంత్. "బ్యూటీఫుల్ స్పోర్ట్స్ క్రికెట్ వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మన జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు కొన్ని పాఠాలను నేర్పిస్తాయి. కొన్నేళ్ల క్రితం ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకు నేను మరింత కృతజ్ఞతగా ఉండాలని నిశ్చయించుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, ఎప్పుడూ నువ్వుతూ ముందుకు సాగాలని నేర్చుకున్నాను. ఈ క్రికెట్ వల్ల నేను ఎలాగైతే సంతోషంగా చిరునవ్వుతో ఉండగలుగుతున్నానో.. అలానే ప్రజల ముఖాలపై కూడా చిరునవ్వును తీసుకురావడం ఇప్పుడు నా లక్ష్యం. అందుకే యాడ్స్ ద్వారా నేను సంపాదించిన మొత్తంలో 10 శాతం పేదలకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాను. RPF ఫౌండేషన్ ను ప్రారంభించాను. ఈ ఫౌండేషన్, దాని లక్ష్యాలు నాకెంతో ప్రత్యేకం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే రెండు నెలలో తెలియజేస్తాను. మీ అందరి ప్రేమాభిమానాలకు, మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు". అని వీడియోలో తెలిపాడు పంత్.

IPL చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా..
రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తమ జట్టుకు కెప్టెన్ గా నియమించింది.