హైదరాబాద్: యువ క్రికెటర్ రిషబ్ పంత్లో 'ప్రత్యేక టాలెంట్' ఉందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ఫైనల్ మ్యాచ్లో రైజింగ్ పుణె, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్కి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదిక అయింది. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్గా ఉన్న సచిన్ టెండూల్కర్ మ్యాచ్కి ముందు పలు విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సీజన్లో రాణించిన భారత యువ క్రికెటర్ల గురించి మాట్లాడాడు.

అందులో నితీశ్ రాణా(ముంబై ఇండియన్స్), రిషబ్ పంత్(ఢిల్లీ డేర్ డెవిల్స్), రాహుల్ త్రిపాఠి(రైజింగ్ పూణె సూపర్ జెయింట్), బసిత్ థంపి(గుజరాత్ లయన్స్), మహ్మద్ సిరాజ్(సన్ రైజర్స్ హైదరాబాద్) ఇలా వీరందరి గురించి ప్రస్తావించాడు. వీరిలో రిషబ్ పంత్లో ప్రత్యేక టాలెంట్ ఉందని చెప్పాడు.
అతనిలో తనకు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాల కలయిక కనబడుతున్నట్టు చెప్పాడు. అతడి ఆటను చూడటం అద్భుతంగా ఉంటుందని కొనియాడాడు. 'తండ్రిని కోల్పోయిన తర్వాత క్రికెట్ ఆడటం కష్టం. నేను కూడా 1999 వరల్డ్ కప్లో రిషబ్ ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొన్నాను. అందులో నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. క్రికెటర్కు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్కు అతని కుటుంబానికి ఫుల్ మార్క్స్. కఠిన సమయాల్లో కుటుంబం మద్దతు చాలా అవసరం' అని సచిన్ చెప్పుకొచ్చాడు.