టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి మరో అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ 'క్రికెట్ హీట్' మొదలైంది. ఈ పొట్టి వరల్డ్ కప్నకు రోడ్ మ్యాప్గా భావిస్తున్న అఫ్గానిస్థాన్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ సిరీస్కు భారత జట్టు ప్రకటించిన తర్వాత చర్చలు మొదలయ్యాయి. కొందరు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చారా లేదా విస్మరించారా తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ విషయంలో!
14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి వచ్చినప్పటికీ రాహుల్ మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు. అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారని కొందరు భావిస్తుంటే.. ఇంగ్లాండ్ సిరీస్ కోసం రాహుల్కు విశ్రాంతి ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచకప్లో టీమిండియా వికెట్ కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్తో పాటు సంజు శాంసన్, జితేశ్ శర్మ, రిషభ్ పంత్ , ఇషాన్ కిషన్ పోటీపడుతున్నారు.

అయితే దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ మాత్రం పంత్కు మద్దతు ఇస్తున్నాడు. పంత్ అసాధారణ ఆటగాడని కొనియాడాడు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ కోలుకుంటున్నాడు. ఐపీఎల్తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్ సమయానికి పంత్ పూర్తిగా కోలుకోకపోతే కేఎల్ రాహుల్ను తీసుకోవాలని గవాస్కర్ సూచించాడు. జితేశ్ శర్మ కూడా కీలక ఆటగాడిని అన్నాడు.
''రాహుల్ వికెట్ కీపర్గా బాగానే రాణిస్తున్నాడు. అయితే రిషభ్ పంత్కు ఒక్క కాలు ఫిట్గా ఉన్నా అతడిని టీమిండియాలోకి తీసుకోవాలి. ఎందుకంటే అతడు గేమ్ ఛేంజర్. నేను సెలక్టర్ అయితే పంత్ను ముందుగా ఎంపిక చేస్తాను. పంత్ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇవ్వాలి. రాహుల్ జట్టుకు సమతూకం తీసుకొస్తాడు. అతడిని ఓపెనర్గానూ, మిడిలార్డర్ బ్యాటర్గానూ, అలాగే ఫినిషర్గా అయిదు, ఆరు స్థానాల్లో బరిలోకి దించవచ్చు''
''పంత్, రాహుల్, జితేశ్ శర్మ మధ్య పోటీ గొప్పగా ఉంది. ముగ్గురూ మంచి ఆటగాళ్లు. జితేశ్ శర్మకు ఆకట్టుకునే స్ట్రైక్రేట్ ఉంది. ఫినిషర్గానూ సత్తాచాటుతున్నాడు. టీ20 ఫార్మాట్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాల కంటే బ్యాటింగ్లో ఫామ్లో ఉంటే జట్టులో స్థానం దక్కించుకోవచ్చు'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. కాగా, మొహాలి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.