
ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ విజయంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా పార్ట్నర్ షిప్ హైలెట్ అని చెప్పాలి. పంత్ తన తొలి వన్డే సెంచరీని సాధించి చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. ఇక పంత్ (113 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్), హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71 పరుగులు) క్రీజులో మొండిగా నిలబడి పోరాడారు. 260పరుగుల లక్ష్యంలో భారత్ 72పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. వీరిద్దరూ కలిసి 115బంతుల్లో 133పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ భారత్ వైపు తిప్పేశారు.
ఇకపోతే 2002లో లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ సైతం ఇలాంటి పార్ట్ నర్ షిప్ నమోదు చేసి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇక తాజాగా పంత్, హార్దిక్ పాండ్యా విలువైన భాగస్వామ్యం 2002నాటి నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను గుర్తుకుతెచ్చిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు.
'పంత్ ఇన్నింగ్స్ నాకు నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువరాజ్, కైఫ్ల ఇన్నింగ్స్ను గుర్తు చేసింది. ఆ మ్యాచ్లో టాపార్డర్ బ్యాటర్లు ఔటయినప్పటికీ.. యువీ, కైఫ్లు మొండిగా పోరాడి అద్భుత విజయాన్ని అందించారు. ఇక నిన్నటి మ్యాచ్లో యువీ, కైఫ్ లాగే పాండ్యా, పంత్ కూడా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాండ్యా ప్రస్తుతం గొప్ప రిథమ్లో ఉన్నాడు. అతను తన ఫిట్నెస్పై చాలా కష్టపడ్డాడు. రిషబ్ పంత్ చాలా పరిణతితో ఆడాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు కాబోతున్నాడు. ప్రతిభ పరంగా అతనికి సాటి రాగల ఆటగాళ్లు కొందరే ఉన్నారు. పాండ్యా, పంత్ లాంటి ఆటగాళ్లు ఉంటే ఇలాంటి లక్ష్యాలను ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు' అని కనేరియా పేర్కొన్నాడు.
ఇక నాటి నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. కెప్టెన్ నసీర్ హుస్సేన్ (115), మార్కస్ త్రెస్కోతిక్ (109) సెంచరీలతో చెలరేగడంతో 325పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక తర్వాత ఛేజింగ్లో 7వ వికెట్కు యువీ (69), కైఫ్ (87) 121పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వైపు తిప్పేశారు. ఇక యువీ చివర్లో ఔటయినా కైఫ్ చివరి వరకు ఉండి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని ముగించాడు.