ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్కు చేరుకున్న టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా తొలి రోజు.. హార్దిక్ బాదిన బంతి తగిలి పంత్ మోకాలికి గాయం తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?, ఫిట్ నెస్ పరిస్థితి ఎలా ఉంది? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పంత్ పరిస్థితి ఎలా ఉందో సమాచారం బయటకు వచ్చింది. ఇదే సమయంలో రెండో రోజు ప్రాక్టీస్ సెషన్ కు వచ్చిన పంత్.. తన చర్యతో అభిమానుల మనసు కూడా దోచుకున్నాడు.
పంత్ అసౌకర్యంగానే..
ఆదివారం (ఫిబ్రవరి 16) ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్య బాదిన షాట్ కు.. దగ్గర్లో ఉన్న వికెట్ కీపర్ పంత్ గాయపడ్డాడు. బంతి బలంగా అతడికి మోకాలిని తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. రెండేళ్ల కిందట పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనపుడు కూడా అదే మోకాలికి తీవ్ర గాయమై శస్ర్త చికిత్స జరిగింది. అయితే ఇప్పుడు తగిలిన గాయం తీవ్రమైంది కాదని, పంత్ కోలుకున్నాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కానీ సోమవారం నెట్ సెషన్ లో పంత్ అసౌకర్యంగా కనిపించాడు. వికెట్కీపింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయలేదు. బ్యాటింగ్ కూడా సాధికారికంగా చేయలేకపోయాడు. కాబట్టి అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

పంత్ ఆటోగ్రాఫ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్..
రెండో రోజు ప్రాక్టీస్ సెషన్ లో పంత్ కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ.. తన కోసం వచ్చిన అభిమానులకు పంత్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు. గాయం తగిలినప్పటికీ.. అభిమానుల కోసం పంత్ సమయం కేటాయించడంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దుబాయ్ లో మ్యాచులు..
ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం (ఫిబ్రవరి 19)న ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ను గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్తో ఆడనుంది. ఈ మెగా టోర్నీని పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. కానీ భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది.