
సౌథాంప్టన్: జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. నెట్ సెషన్స్ తర్వాత ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా.. బ్యాట్స్మెన్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ శుక్రవారం నిర్వహించారు. ఈ మ్యాచులో రిషబ్ పంత్ చెలరేగాడు.
ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, అజింక్య రహానేలు బంతిని మిడిల్ చేస్తూ కట్, ప్లిక్ షాట్లు ఆడుతూ కనిపించారు. అయితే రిషబ్ పంత్ మాత్రం ఎప్పటిలా తన సహజశైలిలో హిట్టింగ్ చేసేశాడు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ స్ట్రయిట్గా భారీ షాట్ ఆడాడు. పేస్ బౌలింగ్లో కూడా అతడు భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే పంత్ హాఫ్ సెంచరీ చేశాడు.
స్పిన్నర్ల బౌలింగ్లో రిషబ్ పంత్ క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు ఆడటం ఇదే మొదటిసారేం కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్లో నాథన్ లయన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు బాదిన పంత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ డొమ్ బెస్, జాక్ లీచ్ బౌలింగ్లో కొన్ని బంతుల్ని స్టాండ్స్లోకి పంపాడు. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచులో కూడా అదరగొట్టాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ బౌలర్లకు అసలు ప్రమాదం పంత్తో పొంచి ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్స్.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. అనంతరం ముంబైలో రెండు వారాల క్వారంటైన్ తర్వాత జూన్ 3న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. ఆపై మూడు రోజులు ఒక్కో ప్లేయర్ సాధన చేశారు. ఇక గురువారం నుంచి అందరూ కలిసి జట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్ హోటల్లో కోహ్లీసేన బస చేస్తున్నది.