
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధ శతకం సాధించాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ వేసిన 84వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి టెస్టుల్లో నాలుగో హాఫ్ సెంచరీ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. పంత్ ధాటిగా ఆడుతుండడంతో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. మూడో సెషన్లో ఇంకా 13 ఓవర్ల ఆట మిగిలిఉంది. భారత్ విజయానికి 59 పరుగులు అవసరం. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. క్రీజులో పంత్ (58), సుందర్ (3) ఉన్నారు.
నాలుగు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శుభమన్ గిల్తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్మెన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ అజింక్యా రహేనే 24 పరుగులకే పెవిలియన్ బాట పట్టి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆసీస్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్న పుజారా 211 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక డాషింగ్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ మరోసారి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో టీంను విజయం దిశగా నడిపిస్తున్నాడు. అయితే మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 269/5. విజయానికి ఇంకా భారత్ 59 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రిజ్లో పంత్, సుందర్ ఉన్నారు. వీరిద్దరు ఔట్ అయితే మ్యాచ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
నాలుగో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్ తరఫున పంత్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.