IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మంగళవారం ఐపీఎల్ సీజన్ చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీపై 118 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేసిన తర్వాత రిషబ్ పంత్ 'ఫ్లిప్' కొట్టడం ద్వారా వేడుకను జరుపుకున్నాడు. ఇది రిషబ్ పంత్ సంతృప్తినిచ్చే ఇన్నింగ్స్.. ఎందుకంటే దీనికి ముందు మొత్తం సీజన్లో అతని బ్యాట్ నుంచి 151 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్పై బీసీసీఐ రూ.30 లక్షల భారీ జరిమానా విధించింది. దిగ్వేష్ రతితో సహా అందరు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను కూడా తగ్గించారు.
రిషబ్ పంత్కు రూ.30 లక్షల జరిమానాను ఎందుకు విధించారు?
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, జట్టుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ స్లో ఓవర్ రేట్ నేరానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్లో ఇది లక్నో సూపర్ జెయింట్స్ చేసిన మూడో నేరం కావడంతో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు రూ.30 లక్షల జరిమానా విధించబడింది. ఈ మ్యాచ్లో మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్కు వ్యక్తిగతంగా రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం(ఏది తక్కువైతే అది) జరిమానా విధించబడింది.

కెప్టెన్ సెంచరీ వృథా
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ వ్యక్తిగత ప్రదర్శన అంతగా ఏమీ లేదు. చివరి మ్యాచ్కు ముందు ఆడిన 13 ఇన్నింగ్స్లలో రిషబ్ పంత్ 151 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మ్యాచ్ లో రిషబ్ పంత్ 118 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 227కి తీసుకెళ్లాడు. అయితే ఈ భారీ స్కోరును చేసినా కూడా లక్నో జట్టు ఓడిపోయింది. రిషబ్ పంత్ ఐపీఎల్ 20205లో 14 మ్యాచ్ల్లో 24.45 సగటుతో 269 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. అతడిని లక్నో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో టైటిల్ గెలుస్తాడని భావించారు కానీ లక్నో జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించింది.
హీరోగా నిలిచిన జితేష్ శర్మ
33 బంతుల్లో 85 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. ఈ ఇన్నింగ్స్లో జితేషే శర్మ6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. అంతకు ముందు ఫిల్ సాల్ట్(30), విరాట్ కోహ్లీ(54) శుభారంభం అందించారు. మయాంక్ అగర్వాల్ కూడా 23 బంతుల్లో 41 పరుగులతో ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుత విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ జట్టుతో మే 29న చండీగఢ్ లోని ముల్లాన్పూర్ లో తలపడనుంది.