
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడిన విషయం తెలిసిందే. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఇన్నాళ్లు ఎటూ తేల్చుకోలేకపోయింది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేదాడి జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్కు అప్పగించాలా అని తర్జనభర్జన పడింది. అయితే చివరికి కెప్టెన్సీ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించిందని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ యజమానులు కిరణ్ కుమార్ గ్రంధి మరియు పార్థ్ జిందాల్ కెప్టెన్ను మార్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. వారు రిషబ్ పంత్కు జట్టు పగ్గాలు అందించేందుకే సిద్దమయ్యారట. యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి జరిగే ఐపీఎల్ మలి దశ మ్యాచ్లకు పంత్ను తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో డీసీ యాజమాన్యం ఓ క్లారిటీ ఇచ్చింది. భుజం గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్కు కెప్టెన్సీ అప్పగించి ప్రయోగం చేయదలచుకోలేదట. ప్రస్తుతం శ్రేయస్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తాడని ఢిల్లీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2021 ముందు ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో శ్రేయస్ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్ 8న భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టనుందని అప్పుడే డాక్టర్లు తేల్చేశారు. దీంతో ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచులకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గత రెండున్నర సీజన్లుగా డీసీ జట్టును శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ముందుండి నడిపించాడు. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్కు కూడా చేరింది. ఇదిలా ఉంటే.. డీసీ జట్టు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 22న సన్రైజర్స్తో ఆడనుంది.
ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ యూఏఈలోని ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరాడు. గాయం బారినపడినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అయ్యర్ చెప్పుకొచ్చాడు. 'జట్టు ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభమయ్యే ఆరు రోజుల ముందు ఇక్కడికి వచ్చా. మా ఆటగాళ్లతో రెండు మ్యాచులు ఆడా. ఇదే ఉత్సాహాన్ని మున్ముందు కొనసాగించాలనుకుంటున్నా. మా జట్టు ఆటగాళ్లు ఆడుతుంటే.. నేను బయట కూర్చోని మ్యాచ్ని చూడటం చాలా కష్టంగా ఉండేది. టీవీ ముందు కూర్చోని ప్రతి మ్యాచ్ని చూస్తూ మైదానంలో ఉన్నానని ఊహించుకునేవాడిని. కానీ ఇదంతా గతం. ఇప్పుడు దానిని మార్చిపోవాలి. యూఏఈ వాతావరణం భిన్నంగా ఉంది. వీలైనంత తొందరగా ఈ పరిస్థితులకు అలవాటుపడాలి' అని పేర్కొన్నాడు.