
హైదరాబాద్: ఢిల్లీ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20ల్లో సరికొత్త రికార్డుని సృష్టించాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు.
టోర్నీలో భాగంగా ఆదివారం హిమాచల్ ప్రదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో 12 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో పంత్ 38 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. తద్వారా టీ20ల్లో వేగవంతంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ చెలరేగడంతో 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు పది వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. గౌతమ్ గంభీర్(30 నాటౌట్) రిషబ్కు సహకారం అందించడంతో 11.4 ఓవర్లలోనే ఢిల్లీ లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ 143 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించడమే ఇప్పటి వరకూ టీ20ల్లో భారత్ తరపున వేగవంతమైన శతకం. అయితే ఇప్పుడు ఆ రికార్డుని రిషబ్ పంత్ అధిగమించాడు. అంతేకాదు టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడు రిషబ్ పంత్ నిలిచాడు.
అండర్-19 వరల్డ్ కప్లో కూడా అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా పంత్ పేరిటే ఉంది. ఇక, టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో క్రిస్ గేల్ పుణే వారియర్స్పై 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.