బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్ తరఫున పంత్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.
పాట్ కమిన్స్ వేసిన 59వ ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు చేసిన రిషబ్ పంత్.. టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. ఎంఎస్ ధోనీ (32), ఫరూఖ్ ఇంజనీర్ (36), వృద్దిమాన్ సాహా (37), నయన్ మొంగియా (39) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తొలి టెస్టులో సాహా విఫలమవరంతో.. రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడుతున్నాడు. మూడో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెంక్కించాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
బాక్సింగ్ డే టెస్టులో కూడా పంత్ ఓ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా ఎనమిది టెస్ట్ ఇన్నింగ్స్లలో 25 పరుగులకు పైగా స్కోర్ చేసిన తొలి భారత బ్యాట్స్మన్ పంత్ మాత్రమే. ఆసీస్ గడ్డపై ఏ భారత బ్యాట్స్మన్ కూడా వరుస 8 ఇన్నింగ్స్లలో 25 పరుగులకు పైగా స్కోర్ చేయలేదు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ లాంటివారికి కూడా ఈ స్కోర్ సాధ్యం కాలేదు. 25, 28, 36, 30, 39, 33, 159, 29 రన్స్ చేశాడు పంత్.
ఇక రిషబ్ పంత్ నాలుగో రోజు ఆటలో పాటతోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కామెరూన్ గ్రీన్, టీమ్ పైన్ జోడీని విడదీసేందుకు స్పిన్తో ఉచ్చు బిగించాల్సిందిగా వాషింగ్టన్ సుందర్కు పంత్ సలహా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని 'స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్' అంటూ పాట రూపంలో చెప్పాడు. ఇది స్టంప్ మైక్ ద్వారా వినిపించడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మ్యాచ్కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి (వీడియో)