ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆల్టైమ్ రికార్డు ధర దక్కించుకున్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్- వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించింది. అయితే తొలుత వేలంలో పంత్ కోసం లక్నో రూ.20.75 కోట్లు వెచ్చించడానికే సిద్ధమైంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్న తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించింది. ఢిల్లీ పంత్ కోసం సాహిసించలేని మొత్తాన్ని బిడ్ వేసి లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
అయితే రిషభ్ పంత్ను రిటైన్ లిస్ట్లో ఎందుకు చేర్చలేదనే విషయాలు, వేలంలో అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించలేకపోవడానికి గల కారణాలను ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ వివరించాడు. రిటైన్ చేసుకోవడానికి పంత్ను తీవ్రంగా ఒప్పించడానికి ప్రయత్నించామని జిందాల్ పేర్కొన్నాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించే ఫిలాసఫీలో భిన్నాభిప్రాయాలే ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడేలా చేశాయని తెలిపాడు.

''శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్లలో వాళ్లు పలికిన ధరకు ఒక్కరిని అయినా మేం కొనుగోలు చేసినట్లు అయితే మా వేలం వ్యూహాలు చిన్నాభిన్నమయ్యేవి. మిగిలిన స్క్వాడ్ను నిర్మించడానికి డబ్బు సరిపోయేది కాదు. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, హ్యారీ బ్రూక్ను తిరిగి పొందలేకపోయే వాళ్లం. జట్టును బ్యాలెన్స్ చేయలేకపోయేవాళ్లం. ఇక పంత్ను రిటైన్ చేసుకోని క్షణంలోనే అతన్ని వేలంలో తిరిగి దక్కించుకోలేమని మాకు అర్థమైంది''
''పంత్ను నా సోదరుడిలా చూస్తాను. అతన్ని రిటైన్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అతను వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మేం దాన్ని గౌరవించాలి. ఇది డబ్బు గురించి కాదు. ఫిలాసఫీ గురించి మాత్రమే. అతను ఫ్రాంచైజీని నడిపించాలనుకునే విధానం, మేం భావించే విధానాలు భిన్నమైనవి. అదే ప్రధాన కారణం.ఈ విషయంలో పంత్కు కాని, మాకు కాని డబ్బు గురించి సమస్యే లేదు. కిరణ్ గ్రాంధి కూడా పంత్ను నిలుపుకోవాలనే చూశాడు. సాధ్యమైనంత వరకు ఓ పాయింట్ వరకు తగ్గి ప్రయత్నిద్దామని చెప్పాడు''
''ఇక నాయకత్వం గురించి కొన్ని అభిప్రాయాలు పంత్కు చెప్పాం. అతను ఏఏ విషయాల్లో మెరుగవ్వాలో సూచించాం. అయితే అతని ఆశయాలు మాకు స్పష్టంగా తెలుసు. అతను ఏ స్థాయి వరకు వెళ్లాలనుకుంటున్నాడో తెలుసు. భారత జట్టుకు సారథి బాధ్యతలు నిర్వర్తించడం అతని కల, ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ వహించి దాన్ని సాకారం చేసుకోవాలని పంత్ భావిస్తున్నాడు'' అని జిందాల్ పేర్కొన్నాడు.
2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్ మినహా.. మిగిలిన అన్ని సీజన్లలో ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 35.31 సగటుతో, 148.93 స్ట్రైక్రేటుతో 3284 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ధర- రూ.కోట్లలో)
అక్షర్ పటేల్ (16.50), కేఎల్ రాహుల్ (14), కుల్దీప్ (13.25), మిచెల్ స్టార్క్ (11.75), నటరాజన్ (10.75), ట్రిస్టన్ స్టబ్స్ (10), జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (9), ముకేశ్ కుమార్ (8), హ్యారీబ్రూక్ (6.25), అభిషేక్ (4), అశుతోష్ (3.80), మోహిత్ శర్మ (2.20), డుప్లెసిస్ (2), సమీర్ రిజ్వీ (0.95), డొనోవాన్, చమీర (0.75), విప్రజ్, కరుణ్ నాయర్ (0.50), మాధవ్ (0.40), మాన్వంత్, త్రిపురణ విజయ్, దర్శన్, అజయ్ (0.30).