గ్రాస్ ఐస్లెట్: ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకాకారులకు సొంత దేశం నుంచే విమర్శలు వస్తుండటంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. విమర్శలు చేయడం సులువేనని, ఒలింపిక్స్ కు ప్రాతినిథ్యం వహించడమంటే మాటలు కాదని అన్నాడు.
అంతేగాక, ఒలింపిక్స్ వంటి పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయమని, వారు ఆ ఘనతను సాధించేందుకే ఎంతో కష్టపడి ఉంటారని విరాట్ కోహ్లీ అన్నాడు. వారు పతకాలు సాధించలేదన్న భాధతో విమర్శిస్తూ, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్న వేళ, వారికి మద్దతుగా నిలిచాడు కోహ్లీ.

అథ్లెట్లను, ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడటాన్ని దయచేసి ఆపాలని, ప్లేయర్లను అవమానించవద్దని సూచించాడు. ఇండియా కోసం ఆడుతున్న వారిని గౌరవించాలని చెప్పాడు. పతకం సాధించాలన్నదే వారి ఆశయమని, ఆ వేటలో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్ల గొప్పదనాన్ని మరువరాదని అన్నాడు.
ఇంకా బరిలో నిలిచివున్న వారు గెలవాలని కోరుకోవాలని భారత క్రీడాభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అహర్నిశలు శ్రమిస్తున్న మన క్రీడాకారుల ఆశయం ఒలింపిక్స్ లో పతకం గెలుచుకోవడమేనని మరోసారి గుర్తు చేశాడు.
గెలుపోటములు సహజం: మోడీ
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీ పడటం గొప్ప విషయమని, ఓటములకు కుంగిపోవడం సరికాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని క్రీడాకారులకు ప్రధాని మద్దుతగా నిలిచారు. ఈ మెగా ఈవెంట్ లో తమ శక్తివంచన లేకుండా పోరాడిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ప్రతీ క్రీడాకారుడు భారత ప్రజలు గర్వించేలా ఉండాలని ఆకాంక్షించారు.
కాగా, ఇటీవల ప్రముఖ రచయిత శోభా డే రియోకు వెళ్లిన భారత క్రీడాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సెల్ఫీలు దిగిరావడం తప్ప, మనవాళ్లు పతకాలు తేలేరని ఆమె వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.