Rinku Singh: ఆసియా కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్లో సంచలనాలే హద్దుగా చెలరేగిపోయాడు. తన తన ఎంపికను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తర ప్రదేశ్ టీ20 (UP T20) లీగ్లో మెరిశాడు. మెరుపులు మెరిపించాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడిన రింకూ.. గోరఖ్పూర్ లయన్స్ జట్టుపై కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. రింకూ సింగ్ 225 స్ట్రైక్ రేట్ ప్రత్యర్థులను కంగుతినిపించింది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరఠ్ జట్టు ఒకానొక దశలో 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ కేవలం 65 బంతుల్లో సాహబ్ యువరాజ్(22)తో కలిసి ఐదో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రింకూ సింగ్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో మీరట్ మావెరిక్స్ 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు గోరఖ్పూర్ లయన్స్ జట్టు 167 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్(38), అక్షదీప్ నాథ్(23) రాణించారు. ఆ తర్వాత నిశాంత్ కుష్వాహ 37 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

మరో మ్యాచ్లో కాశీ రుద్రాస్ జట్టు కెప్టెన్ కరణ్ శర్మ, అభిషేక్ గోస్వామి అర్థ సెంచరీల సహాయంతో నోయిడా కింగ్స్ జట్టును 88 పరుగుల తేడాతో ఓడించి తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కాశీ జట్టు తరఫున అభిషేక్ గోస్వామి(50), కరణ్ శర్మ(58) తొలి వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శుభం చౌబే 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 173/6కు చేరింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నోయిడా కింగ్స్ కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయింది. కాశీ బౌలర్లలో కార్తీక్ యాదవ్ నాలుగు వికెట్లు, శివ రెండు వికెట్లు పడగొట్టి విజయాన్ని సులభతరం చేశారు.