ఆసియా గేమ్స్లో పోటీ పడేందుకు పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఆసియా క్రీడల్లో టీమిండియా పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ జట్టు కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కు అప్పజెప్పిన సెలెక్టర్లు.. ఫినిషర్గా ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ను ఎంపిక చేశారు. అసలు అతనికి వెస్టిండీస్తో ఆడే జట్టులోనే చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.
కానీ బీసీసీఐ మాత్రం వేరే ప్లాన్ వేసింది. అతన్ని విండీస్ టూర్కు ఎంపిక చేయలేదు. అయితే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ఎంపిక చేసింది. ఆ మధ్యలో ఐర్లాండ్పై రింకూ అరంగేట్రానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు టీమిండియాలో చోటు దక్కడంపై రింకూ సింగ్ స్పందించాడు. తాను భారత జెర్సీ వేసుకున్నప్పుడు కచ్చితంగా కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పాడు.

ఐపీఎల్లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లతో కేకేఆర్ను గెలిపించిన తర్వాత రింకూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అదే సమయంలో పేదరికం నుంచి స్టార్డమ్కు అతని ప్రయాణం కూడా చాలా పాపులర్ అయింది. ఒకానొక సమయంలో ఒక కోచింగ్ సెంటర్లో స్వీపర్ ఉద్యోగం కూడా దొరకని అతను.. ఇప్పుడు టీమిండియాకు ఎంపికయ్యాడు. అందుకే ఆ జెర్సీ వేసుకున్నప్పుడు తన కళ్లలో కచ్చితంగా నీళ్లు వచ్చేస్తాయని అన్నాడు.
'నేను బలంగా ఉంటాను. కానీ ఎమోషన్స్ కూడా ఎక్కువే. అందుకే చెప్తున్నా.. టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు నా కళ్లలో గ్యారంటీగా నీళ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూశా. చాలా కాలం ఈ క్షణం కోసం ఎదురు చూశా. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ టీమిండియాకు ఆడాలనే అనుకుంటారు. ఒక్కసారైన ఆ జెర్సీ వేసుకోవాలని ఆశ పడతారు. అయితే నేను మరీ ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించను' అని రింకూ తెలిపాడు.
'మనం ఫ్యూచర్ గురించి ఆలోచించే కొద్దీ.. మనపై భారం పెరుగుతుంది. అందుకే నేను ఏరోజుకు ఆ రోజులోనే బతుకుతా' అని రింకూ చెప్పాడు. అలాగే తనను ఆ జెర్సీలో చూస్తే.. తనకన్నా తల్లిదండ్రులు, కుటుంబమే ఎక్కువ సంతోషిస్తుందన్నాడు. చాలా ఏళ్లుగా ఆ క్షణం చూడాలని తన కుటుంబం వెయిట్ చేస్తోందని చెప్పుకొచ్చాడు. తన కోసం కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని, తను టీమిండియా జెర్సీ వేసుకున్న రోజు వాళ్లకే అంకితం అని ఎమోషనల్ అయ్యాడు.
టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణయి, ఆవేష్ ఖాన్,, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: వెంకటేశ్ అయ్యర్, యష్ ఠాకూర్, సాయి కిషోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్