మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియా ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఎంతో మంది ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. కానీ అంచనాలు అందుకోలేకపోయారు. ఆ స్థానంలో హార్దిక్ పాండ్య కొన్నిసార్లు అలరించినప్పటికీ నిలకడగా సత్తాచాటలేకపోయాడు. కానీ గత కొన్ని నెలలుగా భారత్కు నయా ఫినిషర్ దొరికాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రింకూ సింగ్ను ప్రశంసలతో ముంచెత్తారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రింకూను ప్రత్యేకంగా కొనియాడాడు. అఫ్గానిస్థాన్ సిరీస్లో అదరగొట్టిన రింకూను ప్రశంసిస్తూ.. ప్రశాంతతో ఉంటూ మ్యాచ్ను ముగించే ఇలాంటి కుర్రాళ్లనే తాను, రాహుల్ ద్రవిడ్ కోరుకుంటున్నామని హిట్మ్యాన్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్లో రింకూ స్థానం ఖరారైనట్లుగా పరోక్షంగా ప్రకటించాడు.

కానీ కట్ చేస్తే.. టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన భారత జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కలేదు. అతనికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. రింకూ లేకుండానే రోహిత్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సోషల్ మీడియాలో రింకూ మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మాజీ క్రికెటర్లు సైతం రింకూను జట్టులోకి చేర్చాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులో తిరిగి చోటు సంపాదించడానికి రింకూ సింగ్కు అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే.. ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 25వ తేదీ వరకు ఐసీసీ గడువు ఇచ్చింది. ఈ లోపు బీసీసీఐ తన మనసు మార్చుకుని రింకూ సింగ్ను ఎంపిక చేయవచ్చు. అలా జరగడం దాదాపు అసాధ్యం. కానీ జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే రింకూకు కచ్చితంగా ఛాన్స్ ఉంటుంది.
ప్రపంచకప్కు సెలక్ట్ అయిన ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఐపీఎల్లోనే ఆడుతున్నారు. ఈ మెగా లీగ్లో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే అది రింకూకు అదృష్టంగా మారినట్లే. ఒకవేళ ఐపీఎల్లో ఎవరూ గాయపడకపోయినా రింకూ ఛాన్స్ ఉంటుంది. జట్టులో చోటు దక్కనప్పటికీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికవ్వడంతో రింకూ టీమిండియాతోనే కలిసి అమెరికా,వెస్టిండీస్కు ఈ నెల ఆఖర్లో బయలుదేరాల్సి ఉంటుంది.
సుదీర్ఘంగా సాగే ఈ వరల్డ్ కప్లోనూ ఆటగాళ్లు గాయపడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రింకూ కచ్చితంగా భారత్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే.. టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన భారత జట్టులో ఎవరైనా గాయపడితే నయా ఫినిషర్కు అవకాశం వస్తుంది. అక్షర్ పటేల్కు గాయమవ్వడంతో ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో రవిచంద్రన్ అశ్విన్కు ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా సార్లు జరిగాయి.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.