రింకూ సింగ్.. ఈ పేరు ఐపీఎల్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2023 ఐపీఎల్ సీజన్లోని ఓ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో ఐదు సిక్స్ లు బాది జట్టును గెలిపించిన వీరుడు. అయితే ఇప్పుడతడు ఐపీఎల్ 2025 ప్రారంభం నేపథ్యంలో మరోసారి చెలరేగి ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్..
ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజన్ లో పాల్గొనే జట్లన్నీ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అయితే ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతున్న కేకేఆర్.. ఈ సారి కూడా టైటిల్ ముద్దాడాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టే టీమ్ కూడా ఎంతో బలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేకేఆర్ టీమ్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఇందులో పర్పుల్ జట్టుకు రహానే సారథ్యం వహించగా, గోల్డ్ టీమ్ కు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ లో పర్పుల్ టీమ్ విజయం సాధించింది.

అదరగొట్టిన ఫినిషర్లు..
ఈ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో కేకేఆర్ ఆటగాళ్లు దుమ్ముదులిపేసేలా ఆడారు. కేకేఆర్ ఫినిషర్లు రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ తమ విధ్వంసకర బ్యాటింగ్తో అద్భుత ప్రదర్శన చేశారు. రింకూ సింగ్ అయితే 19 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అలానే ఆండ్రీ రస్సెల్ కూడా 23 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీ బాదాడు. ఈ ప్రదర్శన చూసిన ఆటగాళ్లు ఈ సారి కూడా కప్.. కేకేఆర్ దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ 2025లో అదరగొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ సీజన్ కోసం KKR రింకూ సింగ్ ను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2023 సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన అతడు.. గత సీజన్లో కేవలం 168 పరుగులే చేశాడు. అయినా కూడా అతడిపై విశ్వాసం ఉంచి ఈ సీజన్ కోసం అట్టిపెట్టుకుంది. మరోవైపు, విండీస్ విధ్వంసక ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ గతంలో KKRను ఒంటరి పోరాటంతో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.