విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఇద్దరు భారత క్రికెట్కు మూలస్తంభాలు. దశాబ్దానికి పైగా టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి విజృంభిస్తే అది ప్రళయమే. ఆ స్థాయిలో సంచలన ప్రదర్శనలు నమోదుచేశారు. అయితే ప్రాణమిత్రులుగా మైదానంలో పరుగుల వరద పారించిన రోహిత్-కోహ్లి మధ్య గతంలో 'కెప్టెన్సీ' చిచ్చుపెట్టిందని అంటుంటారు.
టీ20 సారథి బాధ్యతలను విరాట్ కోహ్లి వదులుకున్న అనంతరం భారత క్రికెట్లో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వన్డే కెప్టెన్సీపై కూడా వేటు పడింది. ఆ తర్వాత విరాట్ టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. మరోవైపు రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జోరుగా సాగినా ఈ ఇద్దరిలో ఒక్కరూ కూడా పెదవి విప్పలేదు.

అయితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలలో ఉత్తమ కెప్టెన్ ఎవరనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారత బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లి టెస్టుల్లో కెప్టెన్గా మరికొంతకాలం కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రోహిత్, కోహ్లి కెప్టెన్సీ నుంచి రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ నాయకత్వం అంటే తనకి ఇష్టమని, దూకుడుగా జట్టును నడిపించే విరాట్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంటుందని రింకూ పేర్కొన్నాడు.
''రోహిత్ కెప్టెన్సీ అంటే నాకిష్టం. అలాగే విరాట్ కోహ్లి కెప్టెన్సీ కూడా. కోహ్లి జట్టును దూకుడుగా నడిపిస్తాడు. అది జట్టుకు ఎంతో కీలకం. కాబట్టి కోహ్లి నాయకత్వం కూడా చాలా బాగుంటుంది'' అని రింకూ పేర్కొన్నాడు. కాగా, ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో రింకూ సింగ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో రోహిత్ తనని ఓదార్చిన తీరు రింకూ వివరించాడు.
''రోహిత్ నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. 'నువ్వు చాలా చాలా యంగ్ ప్లేయర్. భవిష్యత్లో ఎన్నో వరల్డ్ కప్లు ఉన్నాయి. నీ శ్రమను కొనసాగించు. ప్రతి రెండేళ్లకు ఓ సారి ప్రపంచకప్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆటపై దృష్టిసారించు. నిరాశ చెందకు' అని అన్నాడు'' అని రింకూ పేర్కొన్నాడు.