T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పటికే పరాజయంతో సతమతమవుతున్న టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆటగాడైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రింకూ సింగ్.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అర్ధాంతరంగా భారత శిబిరాన్ని వీడి స్వదేశానికి బయలుదేరారు. జింబాబ్వేతో జరగనున్న కీలకమైన సూపర్-8 మ్యాచ్కు ముందు రింకూ దూరం కావడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
ఆసుపత్రిలో తండ్రి.. వెంటిలేటర్పై చికిత్స
రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని ఓ స్థానిక ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే రింకూ సింగ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సోమవారం జట్టుతో కలిసి చెన్నై చేరుకున్న రింకూ.. మంగళవారం ఉదయాన్నే తన తండ్రిని చూసేందుకు చెన్నై నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కూడా ఆయన పాల్గొనలేదు.

జింబాబ్వే మ్యాచ్కు దూరం?
ఫిబ్రవరి 26న అహ్మదాబాద్ వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్లో రింకూ సింగ్ ఆడే అవకాశం దాదాపు లేనట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మళ్లీ జట్టుతో ఎప్పుడు కలుస్తారనే దానిపై స్పష్టత లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయి కష్టాల్లో ఉంది. ఇప్పుడు జింబాబ్వే వంటి ప్రమాదకరమైన జట్టుతో తలపడాల్సి ఉన్న సమయంలో రింకూ దూరం కావడం పెద్ద లోటుగా పరిగణించవచ్చు.
జట్టులోకి అక్షర్ పటేల్?
రింకూ సింగ్ అందుబాటులో లేకపోతే, తుది జట్టులో ఆ స్థానాన్ని అక్షర్ పటేల్తో భర్తీ చేసే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచ్లో అక్షర్ పటేల్ను పక్కన పెట్టడంపై ఇప్పటికే మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రింకూ స్థానంలో అక్షర్ రావడం వల్ల జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు బలం చేకూరనుంది.
భారత్ ముందున్న సవాల్
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్, సెమీఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ (జింబాబ్వే, వెస్టిండీస్పై) భారీ తేడాతో విజయం సాధించాలి. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉండటంతో ప్రతి మ్యాచ్ టీమిండియాకు ఫైనల్ లాంటిదే.