టీమిండియాలో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తూ సత్తాచాటుతున్నారు. భవిష్యత్ కు భరోసా ఇస్తూ విజయాలు సాధిస్తున్నారు. శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా పోటాపోటీగా పరుగుల వరద పారిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలా జైశ్వాల్ ఆది నుంచే ప్రత్యర్థి దాడి చేస్తుంటే.. గిల్, రుతురాజ్ సందర్భాన్ని బట్టి గేర్ మారుస్తూ పరుగులు చేస్తున్నారు.
అయితే టీమిండియాకు నయా ఫినిషర్ గా రింకూ సింగ్ అదరగొడుతున్నాడు. ఆఖర్లో అసాధ్యమైన పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా ధోనీలా ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. అయితే రింకూను అందరూ ధోనీతో పోలుస్తుంటే.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం యువరాజ్ సింగ్ తో పోల్చాడు.

''అందరికీ టాలెంట్ ఉండదు. మీరు రోజంతా ఆడగలరు. కానీ ఏదో ఒక టైమ్ లో అనుకున్నంత సామర్థ్యం ఉండదని మీరు తెలుసుకుంటారు. కానీ రింకూ సింగ్ అలా కాదు. అనుకున్నది సాధిస్తాడు. గత రెండు మూడేళ్లుగా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్ లోనూ తానేంటో నిరూపించాడు. అందివచ్చిన అవకాశాల్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
''ఫైనల్ గా టీమిండియాలో చోటు సంపాదించాడు. ఇప్పుడు అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అతడిని మరో యువరాజ్ సింగ్ లా అందరూ భావిస్తున్నారు. అవును, రింకూ సింగ్ మరో యువరాజ్ సింగ్. యువీ భారత క్రికెట్ కు ఎలాంటి విజయాల్ని అందించాడో రింకూ కూడా అలానే సాధిస్తాడు'' అని రింకూని సునీల్ గవాస్కర్ కొనియాడాడు.
ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో రింకూ సింగ్ రాణించాడు. నాలుగు ఇన్నింగ్స్ లో 105 పరుగులు చేశాడు ఇందులో రెండు సార్లు నాటౌట్ గా నిలిచాడు. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే, టీ20లకు రింకూ ఎంపికయ్యాడు. కాగా, తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో మ్యాచ్ మంగళవారం జరగనుంది.