ఐపీఎల్ మెగావేలం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోరాహోరీ మ్యాచ్లకు కలిగే ఉత్కంఠ మెగా ఆక్షన్పై పెరిగింది. మెగావేలం కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి? రిటైన్డ్ ప్లేయర్ల సంఖ్య పరిమితి ఎంత? రైట్ టూ మ్యాచ్ కార్డు ఎంతమంది కోసం వినియోగించుకోవచ్చు? అన్క్యాప్డ్, రిటైర్డ్ ప్లేయర్ల రూల్స్ గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చర్చ జోరుగా సాగుతోంది.
గత నిబంధనల మేరకు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఓ ఫ్రాంచైజీ రిటైన్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధన ఐపీఎల్-2024 ఛాంపియన్ కేకేఆర్కు తలనొప్పి తెచ్చిపెట్టనుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యువ ప్లేయర్లు వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, స్టార్ విదేశీ ప్లేయర్లు రసెల్, సునీల్ నరైన్లలో కొందరే తమ జట్టుతో కొనసాగే పరిస్థితి ఎదురుకానుంది.

ఈ నేపథ్యంలో రింకూ సింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనని కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్డ్ చేసుకోకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాలని ఉందని రింకూ పేర్కొన్నాడు. ఆర్సీబీనే ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా రింకూ వివరించాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లి ఉండటంతో ఆ ఫ్రాంచైజీకి వెళ్లాలని ఉందని ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పాడు.
అలాగే దులీప్ ట్రోఫీకి తను ఎంపిక కాకపోవడంపై కూడా రింకూ సింగ్ మాట్లాడాడు. మెరుగైన ప్రదర్శన చేయనందుకే ఎంపిక కాలేదని తెలిపాడు. ''బాగా ఆడలేదు. అసలు రంజీట్రోఫీ మ్యాచ్లే నేను ఎక్కువగా ఆడలేదు. రెండు మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాను. వాటిల్లోనూ మెరుగ్గా రాణించలేకపోయాను. అందుకే నేను సెలక్ట్ కాలేదు. రానున్న మ్యాచ్ల్లో ఎంపిక అవుతానని ఆశిస్తున్నా'' అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.