గబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. ఆతిథ్య జట్టు 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
అయితే టీమిండియా బ్యాటింగ్ లో రింకూ సింగ్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. మరోసారి సంచలన ప్రదర్శన చేసి తన సత్తాచాటి చెప్పాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీలు, సిక్సర్లుతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాది అజేయంగా 68 పరుగులు చేశాడు. తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు.

అయితే రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ కు మీడియా బాక్స్ గ్లాస్ పగిలిపోయింది. మార్క్రమ్ వేసిన 19వ ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్ చివరి రెండు బంతులును రింకూ సింగ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతిని స్ట్రైట్గా ఆడగా సైట్ స్క్రీన్పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్ను బలంగా తాకి పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
దీన్ని గురించి నయా ఫినిషర్ రింకూ సింగ్ స్పందించాడు. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చానని, ఆ టైమ్ లో సూర్యకుమార్ యాదవ్ తనని గైడ్ చేశాడని రింకూ చెప్పాడు. వికెట్ల గురించి ఆలోచించకుండా, తన స్టైల్ లో ఆడమని సూర్య సూచించాడని తెలిపాడు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నాని, తర్వాత పరుగులు సాధించానని పేర్కొన్నాడు.
మీడియా బాక్స్ గ్లాస్ బద్దలవ్వడం గురించి స్పందిస్తూ.. ఆ సమయంలో తనకి గ్లాస్ పగిలిన విషయం తెలియదని, డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తర్వాత సహచర ఆటగాళ్లు చెప్పారని అన్నాడు. తన వల్ల అది జరిగినందకు సారీ చెప్పాడు రింకూ సింగ్.