ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ముచ్చటగా మూడోసారి టైటిల్ ముద్దాడింది. 2012, 2014 సీజన్లలోనూ కోల్కతా ట్రోఫీ నెగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ఏడేళ్ల క్రితమే కేకేఆర్ ఫ్రాంచైజీలో అడుగుపెట్టిన రింకూ సింగ్ తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు.
అనంతరం రింకూ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. ఏడేళ్లుగా నిరీక్షణ ఫలించిందని, ఇదంతా పైవాడి లీల అని అన్నాడు. ''నా ఏడేళ్ల కల నెరవేరింది. అంతిమంగా ట్రోఫీని అందుకున్నాను. మా జట్టు, గౌతమ్ గంభీర్ పట్ల ఎంతో గర్వపడుతున్నా. ఇదంతా పైవాడి లీల'' అని రింకూ సింగ్ అన్నాడు. అయితే మరో అయిదు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ను కూడా అందుకుంటానని రింకూ పేర్కొన్నాడు.

''మొదట నొయిడాకు వెళ్తా. ఆ తర్వాత అమెరికా బయలుదేరుతాను. మీరు చూస్తుండి. ప్రపంచకప్ను కూడా అందుకుంటాను'' అని రింకూ సింగ్ అన్నాడు. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. అయితే రింకూ అసలు టీమిండియాకు ఎంపిక కాలేదు. కేవలం రిజర్వడ్ ప్లేయర్గా సెలక్ట్ అయ్యాడు. కానీ రింకూ కాన్ఫిండెట్గా చెప్పడంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది.
కచ్చితంగా తుది జట్టులో ఎంపిక అవుతాననే ఆత్మవిశ్వాసంతో రింకూ సింగ్ చెప్పడంతో శివమ్ దూబెపై వేటు పడుతుందని భావిస్తున్నారంతా. మెగాటోర్నీకి భారత జట్టును ప్రకటించిన తర్వాత దూబె ప్రదర్శన తీసికట్టుగా మారింది. అయిదు మ్యాచ్ల్లో కేవలం 46 పరుగులే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉండటం గమనార్హం. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్తో ఒత్తిడికి చిత్తయ్యాడు. 15 బంతుల్లో ఏడు పరుగులే చేసి సీఎస్కే ఓటమికి ఓ కారణమయ్యాడు.
దీంతో దూబెపై వేటు పడటం ఖాయమే అని భావిస్తున్నారంతా. మరోవైపు గత సీజన్లో రింకూ 474 పరుగులతో సంచలన ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. కానీ ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్లో 168 పరుగులే చేశాడు. కేకేఆర్ టాప్ ఆర్డర్ చెలరేడంతో రింకూ చేతికి పని ఎక్కువగా దొరకలేదు. అయితే దూబెకు ప్రత్యామ్నాయంగా రింకూ ఎంపికవ్వడానికి మరో అంశం కలిసొస్తుంది.
రింకూ ఫినిషర్ పాత్ర సమర్థవంతంగా పోషించగలడు. భారత జట్టు కూర్పులో దూబెకు సరిపోయే నాలుగు, అయిదు స్థానాలు ఖాళీగా లేవు. కానీ ఫినిషర్ రోల్లో ఈజీగా చోటు దక్కించుకోవచ్చు. దీంతో వరల్డ్ కప్లో రింకూ ఎంట్రీ గ్యారెంటీలా అనిపిస్తుంంది.