అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నప్పటికీ, ఓవరాల్గా బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. ఈ పరిస్థితిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
షమి కోసం భారత జట్టు తలుపులు తెరిచి ఉన్నాయని రోహిత్ అన్నాడు. అయితే అతను ఫిట్గా ఉన్నాడని వంద శాతం కంటే ఎక్కువగా నమ్మినప్పుడే జట్టులోకి తీసుకుంటామని తెలిపాడు. ఇటీవల షమికి మోకాలికి వాపు రావడంతో తిరిగి ఆలోచనలో పడ్డామని చెప్పాడు. కాగా, భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ సాగుతున్న సమయంలో రోహిత్ - షమి గొడవపడ్డారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెంగళూరు టెస్టు సందర్భంగా ఎన్సీఏలో ఉన్న షమి టీమిండియాతో కలిశాడు.

అయితే బెంగళూరు టెస్టుకు ముంగిట షమి గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమి తిరిగి గాయపడ్డాడని, మోకాలు వాపుకు గురైందని అన్నాడు. కానీ కొన్ని రోజుల ముంగిట తాను పూర్తిగా కోలుకున్నానని షమి చెప్పాడు. గాయం గురించి వేర్వేరు ప్రకటన రావడంపై రోహిత్తో షమి నేరుగా మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఆ తర్వాత షమి తిరిగి పోటీ క్రికెట్ మొదలుపెట్టాడు.
చీలమండ గాయంతో మహహ్మద్ షమి గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023-ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత గాయానికి సర్జరీ చేసుకున్న ఈ కుడిచేతి వాటం పేసర్ దాదాపు సంవత్సరం ఆటకు దూరమయ్యాడు. ఇటీవల రంజీ ట్రోఫీతో పోటీ క్రికెట్ను మొదలుపెట్టిన షమీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బరిలోకి దిగాడు. కాగా, కెప్టెన్తో షమి గొడవపడటం వల్ల రీఎంట్రీ ఆలస్యం అవుతుందని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.