ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే మరోవైపు ఐపీఎల్ మెగావేలం జరిగే సమయంలోనే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు జరగనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టులో మూడు, నాలుగు రోజుల్లోనే వేలం కొనసాగనుంది.

భారత కాలమాన ప్రకారం పెర్త్ టెస్టు రోజు ఆట ఉదయం 7.50 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 2.50 గంటలకు ఆట పూర్తవుతుంది. ఇది ముగిసిన పది నిమిషాలకు మెగావేలం జరగనుంది. అయితే తొలి టెస్టు, రెండో టెస్టు మధ్యలో 9 రోజుల సమయం ఉందని, ఆ టైమ్లో మెగా ఆక్షన్ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టు జరిగే రోజుల్లోనే నిర్వహించడం వల్ల ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు.
''తొలి టెస్టు మధ్యలో ఐపీఎల్ ఆక్షన్ నిర్వహించడాన్ని నేను అంగీకరించను. ఇది చెత్త నిర్ణయం. తొల టెస్టు, రెండో టెస్టు మధ్యలో 9 రోజుల సమయం ఉంటుంది. ఎందుకు ఆ సమయంలో వేలాన్ని నిర్వహించకూడదు? టెస్టు జరుగుతున్న సమయంలో ప్లేయర్లు ఒత్తిడికి గురవుతారని మీకు తెలుసు'' అని మైకేల్ వాన్ అన్నాడు. తొలి టెస్టు ఆడే ఆటగాళ్లలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్లు మెగా వేలంలో భారీ డిమాండ్ పలికే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.50)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).