
హైదరాబాద్: స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించడాన్ని ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తీవ్రంగా తప్పుబట్టాడు. హోల్డర్పై నిషేధం విధించే ముందు ఐసీసీ కనీసం కామన్సెన్స్ లేకండా వ్యవహరించిందంటూ దుయ్యబట్టాడు.
ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన వార్న్... ఈ విషయంలో సవాల్ చేయాల్సిందిగా హోల్డర్కు సూచించాడు. ఈ మేరకు ట్విట్టర్లో "ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మూడు రోజులు మించి జరగలేదు. అటువంటప్పుడు స్లో ఓవర్రేట్ అంటూ హోల్డర్పై మ్యాచ్ నిషేధం విధించడం నిజంగానే చెత్త నిర్ణయం. ఇక్కడ ఐసీసీ కనీసం ఇంగితం కూడా లేకుండా వ్యవహరించింది. హోల్డర్.. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లు" అని అన్నాడు.
మరోవైపు రెండో వన్డేలో ఇంగ్లాండ్పై విజయం సాధించి సిరీస్ను ఇంకో మ్యాచ్ ఉండగానే కైవసం చేసకున్న వెస్టిండిస్ జట్టుని షేన్ వార్న్ అభినందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ ఎంత బలమైనదో మరోసారి నిరూపించిందని... ఇదే విజయ పరంపరను భవిష్యత్తులో కూడా విండిస్ జట్టు కొనసాగించాలని అన్నాడు.
వెస్టిండిస్తో జరిగిన తొలి టెస్ట్లో 381 పరుగులతో ఇంగ్లాండ్ ఓడిపోగా... 2009 తర్వాత ఇంగ్లాండ్పై వెస్టిండీస్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మూడో టెస్టు ఫిబ్రవరి 9నుంచి గ్రాస్ ఐలెట్లో జరగనుంది.
హోల్డర్పై ఓ మ్యాచ్ నిషేధం
స్లో ఓవర్ రేట్ కారణంగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో విండీస్ బౌలర్లు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేశారు. గతేడాది జూన్లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్లోనూ హోల్డర్ బృందం రెండు ఓవర్లు తక్కువగా వేసింది.
ఈ రెండు సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో హోల్డర్పై ఓ మ్యాచ్ నిషేధం విధించాడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే మూడో టెస్ట్కు హోల్డర్ దూరమయ్యాడు. నిషేధంతో పాటు హోల్డర్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. ఇతర జట్టు సభ్యులకు 20 శాతం కోత పడింది. శనివారం నుంచి సెయింట్ లూసియాలో విండీస్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ జరుగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది.