
హైదరాబాద్: ఐసీసీ ఏకపక్షంగా దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడపై నిషేధం విధించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ మండిపడ్డాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ను క్లీన్బౌల్డ్ చేసిన రబాడ రెచ్చగొట్టే విధంగా అతి సంబరాలు చేసుకున్నాడు.
ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని 2.5 నిబంధనను రబాడ అతిక్రమించినట్లు తేల్చిన మ్యాచ్ రిఫరీ.. అతని మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు ఒక డీ మెరిట్ పాయింట్ను జత చేర్చాడు. కగిసో రబాడకు ఈ రెండేళ్లలో ఇది నాలుగో డీ మెరిట్ కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ టెస్టు నిషేధం పడింది.
దీంతో జనవరి 24 నుంచి జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు కగిసో రబాడ దూరమయ్యాడు. రబాడపై ఐసీసీ నిషేధం విధించడాన్ని బ్రెట్ లీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. క్రికెట్ను క్రీడాస్ఫూర్తితో ఆడాలనుకోవడంలో తప్పులేదని, అయితే రబాడపై ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుందని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
బ్యాట్స్మెన్ ఔటైన సందర్భంగా రబాడ సంబరాలు చేసుకున్నాడని ఇందులో అతడి తప్పేమీ లేదని బ్రెట్ లీ అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ నిర్ణయంతో ఏకీభవించలేనని తెలిపాడు. ఈ సిరీస్లో రబాడ ఇప్పటికే 14 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
102/6 ఓవర్నైట్ స్కోరుతో ఐదవ రోజు సోమవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. విదేశాల్లో ఇది ఇంగ్లండ్కు 150వ టెస్ట్ విజయం కావడం విశేషం. జో రూట్కు తోడు మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయడంతో సపారీలు కోలుకోలేకపోయారు.
ఫిలాండర్ (13), రబడ (16), నొర్జే (5), మహారాజ్ (71) చివరి రోజు పెవిలియన్ చేరారు. కెప్టెన్ డుప్లెసిస్ (36), మహారాజ్ (71) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు నష్టపోయి 499 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్లో సఫారీలు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ఒలీ పోప్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.