Ricky Ponting: దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతుంటే.. రికీ పాంటింగ్ మాత్రం తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు. తాను ఇండియాలో ఉండిపోవడమే కాకుండా.. పంజాబ్ జట్టులోని ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపి వారి మనస్సును మార్చుకునేలా చేశాడు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది వారి స్వస్థలాలకు పయనం అయ్యారు. పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా శనివారం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. కానీ విమానం బయలుదేరడానికి ముందు కాల్పుల విరమణ నిర్ణయం వెలువడడంతో రికీ పాంటింగ్ వెంటనే విమానం దిగిపోయారు. ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ జట్టులోని విదేశీ ఆటగాళ్లు కూడా ఇండియాలోనే ఉండేలా ధైర్యాన్ని నూరిపోశాడు. అయితే పంజాబ్ జట్టులోని కీలక ఆటగాళ్లైన మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్లు భారత్ ను వీడాడు. వారు మళ్లీ అవసరాన్ని బట్టి భారత్ కు బయల్దేరే అవకాశం ఉంది.

రికీ పాంటింగ్ అంకితభావానికి ఇది నిదర్శనమని పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ వెల్లడించారు. పాంటింగ్ మాత్రమే ఇలా చేయగలడని ప్రశంసించాడు. రికీ పాంటింగ్ స్వచ్ఛందంగా ఉండిపోవడమే కాకుండా విదేశీ ఆటగాళ్లులో స్ఫూర్తిని రగిలించాడని.. ఇప్పుడు వారంతా తిరిగి జట్టులో చేరబోతున్నారని సతీష్ మీనన్ తెలిపారు.
మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో రద్దు చేయబడిన సంగతి తెలిసిందే. దీని తర్వాత రెండు జట్లను ప్రత్యేక వందే భారత్ రైలులో ఢిల్లీకి తీసుకెళ్లారు. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆటగాళ్లందరినీ ఇళ్లకు పంపడం గురించి బీసీసీఐ మాట్లాడింది. దీని తర్వాత రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా వెళ్లడానికి ఢిల్లీ నుంచి తన విమానం ఎక్కాడు. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ ఇద్దరూ ఇండియాలోనే ఉండటానికి అంగీకరించారు.