ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. తాము ఎక్కడికీ వెళ్లట్లేదని, క్రికెట్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. రోహిత్ భవిష్యతులో మరింత మెరుగ్గా రాణించేందుకు ఫోకస్ చేయగా.. కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే ఈ ఇద్దరికీ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడబోయే ఐదు టెస్టుల సిరీస్ అతిపెద్ద సవాల్ లాంటిది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్.. కోహ్లీ-రోహిత్ భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరికీ టెస్ట్ క్రికెట్ సవాలుగా మారుతోందని అన్నాడు. అయితే వారిద్దరి తక్కువ అంచనా వేయాలనుకోవడం లేదని, ఎందుకంటే ఇద్దరికీ మ్యాచ్ తిప్పగలిగే సామర్థ్యం ఉందని చెప్పాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు క్రికెటర్లు ఒకరికొకరు బాసటగా నిలుస్తుంటారని పేర్కొన్నాడు.
తక్కువ అంచనా వేయను...
"విరాట్ గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. 'నాణ్యమైన ప్లేయర్లను.. కేవలం వారు ఎదుర్కొంటున్న ఓ క్లిష్టమైన దశ ఆధారంగా తక్కువగా చూడలేం. ఎందుకంటే వాళ్లు ఛాంపియన్స్. ఎంతటి కష్టమైన సమయంలోనైనా వారు గెలిచే మార్గాన్ని కనుక్కుంటారు. గత రెండేళ్లలో విరాట్ దారుణమైన ఫామ్ లో ఉన్నప్పటికీ, అతడు తిరిగి రాణించడం చూశాం. అతడు అత్యున్నత స్థాయి ఆటగాడు. రోహిత్ కూడా అలాంటివాడే కావొచ్చు. అయితే ఇప్పుడు వాళ్లకి టెస్ట్ క్రికెట్ మాత్రం కాస్త సవాలుగా మారుతోంది. రోహిత్ ఎలాగో వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పలేదు. ఇక విరాట్ నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ వైట్ బాల్ ప్లేయర్. వాళ్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను." అని పాంటింగ్ అన్నాడు.

ద్రవిడ్ తో అలా చెప్పా..
రాహుల్ ద్రవిడ్ తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు రికీ పాంటింగ్. ''మనమదరం ద్రవిడ్ ఫామ్ లేక ఇబ్బంది పడిన రోజులను చూశాం. మీడియాలో అంతా అతడి గురించే. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. మేమిద్దరం మైదానంలోనే మంచి పోటీదారులం. ఇద్దరం చాలా కాలం పాటు మూడో స్థానంలో వచ్చి ఆడేవాళ్లం. అప్పుడు నేను అతడితో ఓ సారి మాట్లాడాను. 'బయట ఏం అనుకుంటున్నారో మరిచిపో. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. నీ ఓ మంచి ప్లేయర్ గా తీర్చిదిద్దిన గతానికి మళ్లీ వెనక్కి వెళ్లు. చిన్న విషయాలను వదిలేయ్. ఆటపై మాత్రమే దృష్టి పెట్టు. తప్పకుండా నువ్వు నీ కెరీర్ ను గొప్పగా ముగిస్తావు' అని చెప్పాను. అతడు కూడా నా కెరీర్ చివరిలో దశలో అలాంటి సందేశమే ఇచ్చాడు. నాకు ఫోన్ చేసిన తొలి వ్యక్తి కూడా ద్రవిడే'' అని పాంటింగ్ నాటి సంఘటను గుర్తు చేసుకున్నాడు.