
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో పాక్ కనీస పోరాటపటిమ కూడా కనబరచకుండా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో పాక్ మరో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో సైతం ఆసీస్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. అనంతరం పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాక్ను ఆసీస్ ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్ నాథన్ లియోన్ ధాటికి పాక్ నిలవలేక 239 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో పాక్పై మాజీలతో సహా అభిమానులు మండిపడుతున్నారు.
తాజాగా పాకిస్థాన్ బౌలింగ్ విభాగం దారుణంగా ఉందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. 'పాక్ ప్రదర్శన దారుణంగా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం టెస్టు క్రికెట్కు అస్సలు సరిపోదు. దీర్ఘకాలంగా ఆసీస్ గడ్డపై దారుణ బౌలింగ్ను చూసినట్లు నాకు గుర్తులేదు. ప్రాక్టీస్, తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసిన నసీమ్ షాను ఈ మ్యాచ్కు ఎందుకు తీసుకోలేదో ఇప్పటికీ అర్థం కాలేదు' అని అసహనం వ్యక్తం చేసాడు.
'పాక్ ముసా అనే కొత్త ఆటగాడిని తీసుకొచ్చింది. అతడు కేవలం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లే ఆడాడు. టెస్టు బౌలర్గా పనికొచ్చేలా కనిపించట్లేదు. పాక్ జట్టులో సరైన బౌలర్లు లేరు. వికెట్లు తీసే ఆటగాళ్లు లేకపోతే ప్రపంచ వేదికపై తమ ముద్ర వేయాలని ప్రయత్నించే ఆసీస్ జట్టును ఓడించడం కష్టం' అని పాంటింగ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఫీల్డింగ్పై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. నిద్ర మత్తులో ఫీల్డింగ్ చేస్తున్నారా అని మండిపడ్డాడు.
ఈ ఓటమితో పాకిస్తాన్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో వరుసగా అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా పేలవమైన రికార్డును ఖాతాలో వేసుకుంది. పాక్ వరుసగా 14 టెస్టుల్లో ఓటమిపాలైంది. 1999 నుంచి ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై పాక్ కనీసం ఒక్క మ్యాచ్ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. చివరిసారిగా పాక్ 1995లో విజయం సాధించింది.