ముంబై: గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తోన్న ఆస్ట్రేలియా క్రికెట్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్కు క్రికెట్ ఆస్ట్రేలియాలో కీలక పాత్ర కట్టబెట్టనున్నారు.
ఇందులో భాగంగానే హఠాత్తుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆసీస్ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఆ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాడ్ మార్ష్ తన పదవి నుంచి వైదొలుగారు.
అతని స్ధానంలో తాత్కాలిక సెలక్టర్గా గ్రెగ్ చాపెల్ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో మరికొన్ని మార్పులు జరగవచ్చని సమాచారం. ''ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన ఐపీఎల్ జట్టుకు ఇక కోచ్గా వ్యవహరించడు. ఒక పెద్ద ప్రకటన రాబోతోంది'' అని ఆసీస్ మాజీ ఆటగాడు డామియన్ మార్టిన్ ట్వీట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు సెలక్టర్గా గానీ కోచ్గా కానీ పాంటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు వరుసగా ఐదు టెస్టులు ఓడిపోవడం.. అందులోనూ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ను ప్రక్షాళన చేసే బాధ్యతను పాంటింగ్కు అప్పగిస్తారని తెలుస్తోంది. 1990-2001 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కామన్ వెల్త్ బ్యాంక్ క్రికెట్ అకాడమీ ద్వారా అత్యుత్తమ క్రికెటర్లను అందించడంలో రాడ్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు.
రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్ లాంటి క్రికెటర్లతో పాటు సుమారు 27 మంది అత్యుత్తమ క్రికెటర్లను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అందించాడు.