దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్పై ఢిల్లీ క్యాపిటల్స్ వేటు వేసింది. ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఏడేళ్లుగా కోచ్ పదవిలో కొనసాగుతున్న పాంటింగ్ జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. గత మూడు సీజన్లలో ఢిల్లీని ప్లేఆఫ్స్కు కూడా చేర్చలేకపోయాడు. దీంతో ఫ్రాంచైజీ అతన్ని తప్పించింది.
2018లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరుకున్నాడు. ఆదిలో తన మార్క్ను చూపించాడు. 2019 నుంచి వరుసగా మూడు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. 2020లో ఢిల్లీని ఫైనల్కు కూడా చేర్చాడు. కానీ టైటిల్ పోరులో తడబడి ఢిల్లీ ట్రోఫీని కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆఖర్లో మెగా వేలం ఉండటంతో కోచ్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించుకుని పాంటింగ్ను తప్పించింది. అయితే పాంటింగ్ తప్పిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించకముందే ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ బెంగాల్ పత్రికకు తెలియజేశాడు. ఏడేళ్లుగా టైటిల్ అందించకపోవడంతో పాంటింగ్ను తప్పించినట్లు తెలిపాడు.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ బాధ్యతలను తాను అందుకోవడానికి ఆసక్తిగా ఉన్నానని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీతో చెబుతానని అన్నాడు. కోచ్గా ఎంపికైన తర్వాత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో మీరే చూస్తారని అన్నాడు. అంతేగాక కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని స్వదేశీ కోచ్లనే ఎంపిక చేయమని కోరతానని గంగూలీ చెప్పాడు.
కాగా, కొన్ని వారాల్లోనే గంగూలీని కోచ్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖర్లో మెగా వేలం ఉండటంతో జట్టును సిద్ధం చేయడానికి ఇప్పటినుంచే ఢిల్లీ క్యాపిటల్స్ పని మొదలుపెట్టనుంది. కెప్టెన్ రిషభ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్, యువ హిట్టర్లు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ మినహా మిగిలిన ఆటగాళ్లని ఢిల్లీ వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి.