తాను చూసిన ఆటగాళ్లలో.. వన్డే ఫార్మాట్ లో విరాట్ కోహ్లీనే బెస్ట్ ప్లేయర్ అని రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో కోహ్లీ నిలకడగా చాలా కాలం నుంచి రాణిస్తున్నాడని కొనియాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై విరాట్ సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డేలో పాంటింగ్ వన్డే పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. అందుకే రికీ పాంటింగ్.. కోహ్లీని ప్రశంసించాడు.
"చాలా కాలం నుంచి అతడు ఛాంపియన్ గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్ లో అతడు అద్భుతమైన ప్లేయర్. వన్డేలో విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని చూడలేదు. ఇప్పటికే అతడు నన్ను దాటేశాడు. అతడి ముందు ఇంకా ఇద్దరే ఉన్నారు. కాబట్టి వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా కోహ్లీ గుర్తిండిపోవడానికి తనకు తానే ఓ గొప్ప అవకాశం ఇచ్చుకోవాలని ఆశిస్తున్నాను." అని పాంటింగ్ పేర్కొన్నాడు.

వన్డేల్లో కోహ్లీ ఇటీవలే 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ 18,426 పరుగులతో ముందున్నాడు. అయితే సచిన్ రికార్డును కోహ్లీ దాటే అవకాశం ఉందని రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. "దీని గురించి ఆలోచిస్తే క్రేజీగా ఉంటుంది. విరాట్ చాలా కాలం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. అయినా కూడా అతడు సచిన్ కన్నా 4 వేల పరుగులు వెనక్కి ఉన్నాడు.
దీన్ని బట్టి సచిన్ ఎంత గొప్ప ప్లేయరో, అతడు ఆట ఎంత కాలం సాగాడో తెలియజేస్తుంది. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు ఉంటే, అతడిని ఎవరూ వదులుకోరు. నేనైతే అస్సలు వదులుకోను. ఎందుకంటే ఫిజికల్ గా కోహ్లీ ఇంకా ఫిట్ గానే ఉన్నాడు. ఇంకా ఆట కోసం కష్టపడుతూ ఆడుతున్నాడు. అసాధారణమైన ప్రదర్శన చేస్తున్నాడు." అని చెప్పుకొచ్చాడు.
Australia great Ricky Ponting was not surprised to see Virat Kohli's superb century against Pakistan 💪https://t.co/zz2iYUwFG5
— ICC (@ICC) February 25, 2025