
ఆడిలైడ్ టెస్టులో ఓటమి పాలైన అనంతరం తమ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శల వర్షం కురిపించాడు. నీవు కెప్టెన్గా ఎందుకున్నావంటూ నిలదీశాడు. అసలు ఏం జరిగిందంటే.. యాషెస్ సిరీస్లో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమైన ఇంగ్లండ్ జట్టు అతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 275 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 473 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో 230 పరుగులు చేసింది. అయితే ఈ రెండు ఇన్నింగ్స్ల్లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులు చేసింది. దీంతో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మాట్లాడాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పింక్-బాల్ టెస్ట్లో వికెట్లు తీయడానికి అవసరమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేకపోయారని మండిపడ్డాడు.
ముఖ్యంగా నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పులే తమ బౌలర్లు ఇప్పుడు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలకడలేమి సమస్య ప్రదర్శించారని అన్నాడు. మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసే అవకాశం ఉండేది రూట్ అభిప్రాయపడ్డాడు.
రూట్ వ్యాఖ్యలపై స్పందించిన ఆస్ట్రేలియా మజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంగ్లండ్ కెప్టెన్పై విమర్శలు గుప్పించాడు. రూట్ వ్యాఖ్యలు విని ఆశ్యర్యానికి గురయ్యానని తెలిపాడు. బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ గూరించి సలహాలు ఇవ్వాల్సింది నీవే కదా, వాళ్లు బౌలింగ్ను తీరును మార్చి ఎక్కడ బంతులు వేయాలో చెప్పాల్సింది నువ్వే కదా అని నిలదీశాడు. నీవు అసలు కెప్టెన్గా మైదానంలో ఉండి ఏం చేస్తున్నావంటూ రూట్ను పాంటింగ్ ప్రశ్నించాడు.
అలాగే నీవు కెప్టెన్గా ఎందుకున్నావని నిలదీశాడు. నువ్వు ఆశించినట్లుగా వాళ్లు బౌలింగ్ చేయకపోతే, నీవు అనుకున్నట్లుగా బౌలింగ్ చేసే వారినే ఆడించాలని సూచించాడు. బ్యాటర్లను ఔట్ చేయడానికి నీవు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకున్నావో, నీ బౌలర్లు ఏం అనుకుంటున్నారో వాళ్లతో మాట్లాడి తెలుసుకోవాలి కదా అని రూట్ను పాంటింగ్ విమర్శించాడు. కాగా వరుసగా రెండు ఓటములతో టెస్ట్ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 0-2తో వెనుకడి ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 నుంచి బాక్సిండ్ డే సందర్భంగా ప్రారంభం కానుంది.