
హైదరాబాద్: ఆస్ట్రేలియా టీ20 జట్టుకు తాను కోచ్గా వ్యవహరించనున్నట్లు వస్తున్న వార్తలను ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తోసిపుచ్చారు. 2020లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియా జట్టు కోచ్గా రికీ పాంటింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై స్పందించిన పాంటింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే దీనిపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశాడు. 'ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియాతో ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే' అని పాంటింగ్ అన్నాడు.
పాంటింగ్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్లో నెట్ వర్క్ టెన్ టీవీకి కామెంటేటర్గా వ్యవహారిస్తున్నారు. 'నాకు కోచింగ్ అంటే ఇష్టం. ఆటగాళ్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. కోచింగ్ బాధ్యతలపై క్రికెట్ ఆస్ట్రేలియాతో ఇప్పటికీ మాట్లాడుతున్నానని, రాబోయే రోజుల్లో కూడా మాట్లాడుతా' అని తెలిపాడు.
'ప్రస్తుతానికి నాకు, క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఇది గనుక ఒకే అయితే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి వాటిని ఎంజాయ్ చేస్తున్నా' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
2019 యాషెస్ సిరిస్ ముగిసిన తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తాను వైదొలగుతున్నట్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కోచ్గా ఉన్నా డారెన్ లీమన్ ఇటీవలే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే ఓ ఇంటర్యూలో ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ కూడా కోచింగ్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే.