టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత టెస్టు క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. పెద్ద వేదికలపై టీమిండియా బ్యాటర్లు భయపడరని, విదేశాల్లో సవాలైన పరిస్థితుల్లో వాళ్లు సాధించిన విజయాలే దానికి ఉదాహరణ అని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ను పాంటింగ్ కొనియాడాడు.
కోహ్లి టెస్టు కెప్టెన్సీలో టీమిండియా 68 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు గెలిచింది. 17 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. 11 టెస్టులను డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుచుకున్న తొలి జట్టుగా కోహ్లి సారథ్యంలోనే భారత్ ఘనత సాధించింది. ఆసీస్తో పాటు ఇతర దేశాల్లోనూ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు అందుకుంది. కోహ్లి దూకుడైన కెప్టెన్సీతో జట్టులో అత్మవిశ్వాసం నింపాడు. అతని గైర్హాజరీలోనూ అదే దూకుడుతో టీమిండియా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.

2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లి భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. తన కుమార్తె వామిక జన్మించిన కారణంతో కోహ్లి ఇండియాకు తిరిగొచ్చాడు. అజింక్య రహానె కెప్టెన్సీలో, సీనియర్ ఆటగాళ్లు గాయాలతో దూరమైనా టీమిండియా సిరీస్ను 2-1తో గెలిచింది. ఈ విజయాలను గుర్తు చేస్తూ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''కోహ్లి కెప్టెన్సీ ప్రారంభం రోజుల్లోకి వెళ్తే.. అతను క్రికెట్ను మలుపు తిప్పడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రాహుల్ ద్రవిడ్ గత కొన్నాళ్ళుగా దాన్ని కొనసాగించాడు. జట్టులో కోహ్లి ప్రభావం గొప్పగా ఉంటుంది. టీమిండియాకు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లు గబ్బాలో విజయం సాధించారు. అది గాలివాటం కాదు. విదేశీ పరిస్థితులను వాళ్ల బ్యాటర్లు చక్కగా అర్థం చేసుకున్నారు''
''గబ్బాలో, ఓవల్లో విజయాలతో వాళ్లు నిర్భయంగా ఉన్నారని అనుకోవట్లేదు. అది సెలక్షన్ వల్ల జరిగింది. వాళ్ళు పెద్ద వేదికలపై ఇక భయపడరు. వాళ్ల ఫాస్ట్ బౌలింగ్ లోతు గొప్పగా ఉంది. గత ఆరు-ఏడేళ్లలో వాళ్ల నాయకత్వం బాగుంది. గత పదేళ్లలో ఐపీఎల్ అనుభవంతో నేను ఓ విషయాన్ని గమనించా. ఒత్తిడితో ఉండే ఐపీఎల్లో యువకులు భయం లేకుండా ధైర్యంగా ఆడుతున్నారు. వాళ్లకు అది ప్రపంచకప్ లాంటిది. దూకుడుగా ఆడే స్ట్రోక్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లు వైఫల్యానికి భయపడరు'' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.