టీమిండియా ప్రధాన కోచ్ పదవి స్వీకరించాలని బీసీసీఐ ఆఫర్ చేసినా తిరస్కరించానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ను నియమించడానికి బీసీసీఐ ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. మే 27, సాయంత్ర 6 గంటలతో అప్లై చేసే గడువు ముగుస్తుంది.
అయితే ఆశించిన వారి నుంచి దరఖాస్తులు ఇంకా అందలేదు. దీని కోసం బీసీసీఐ ప్రత్యేకంగా రంగంలోకి దిగినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించినప్పటికీ వాళ్ల ఆసక్తి చూపట్లేదని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు, ఫ్లెమింగ్తో కోచ్ పదవికి అప్లై చేయించడానికి బీసీసీఐ ధోనీ సహాయాన్ని కూడా కోరినట్లు కథనాలు వచ్చాయి.

ఈ విషయాలపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ తనని బీసీసీఐ వర్గాలు సంప్రదించాయని రికీ పాంటింగ్ స్వయంగా వెల్లడించాడు. నేషనల్ టీమ్తో కలిసి సీనియర్ కోచ్గా పని చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఓ కారణంతో ఆఫర్కు నో చెప్పినట్లు వెల్లడించాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమోననే ఆలోచనతో తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్ను కోచ్గా కొనసాగమని బీసీసీఐ కోరినప్పటికీ 'ది వాల్' కూడా అదే కారణంతో తప్పుకుంటున్న విషయం తెలిసిందే.
''కోచ్గా నన్ను బీసీసీఐ సంప్రదించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కొన్ని విషయాలు నాకు కూడా తెలియనప్పటికీ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతుంటాయి. అయితే ఐపీఎల్ సాగుతున్న సమయంలో టీమిండియా కోచ్గా నాకు ఆసక్తి ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జాతీయ జట్టుకు సీనియర్ కోచ్గా పనిచేయాలని నాకూ ఉంది. కానీ నేను ఫ్యామిలీతో సమయాన్ని గడపాలి''
''అంతేగాక భారత జట్టుకు కోచ్గా ఎంపికైతే ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు కూడా పని చేయడానికి వీళ్లేదు. ఇది కూడా మరో కారణమే. ప్రధాన కోచ్ ఏడాదికి 10 నుంచి 11 నెలల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇది నా లైఫ్ స్టైల్కు సరిపోదు'' అని రికీ పాంటింగ్ అన్నాడు. టీమిండియా కోచ్ పదవి తీవ్ర ఒత్తిడితో ఉంటుంది. విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకోవడానికి ఇదే ప్రధాన కారణమని, కానీ ఇతర సాకులు చెబుతున్నారని క్రికెట్ విశ్లేషుకులు భావిస్తున్నారు. కాగా, భారత జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.