సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో ఆసక్తికర టెస్టు సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియను ఢీకొననుంది. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియషిప్ (2023-25) ఫైనల్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఇతర జట్లపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు చేరాలంటే భారత్ 4-0తో సిరీస్ గెలవాల్సి ఉంది.
అయితే ఈ సిరీస్లో విరాట్ కోహ్లిని తక్కువగా అంచనా వేయొద్దని ఆస్ట్రేలియా జట్టుకు మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. ఇటీవల ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. కోహ్లి మునపటి కోహ్లి కాదని, 2018లో చూసిన విరాట్ ఎంతో తీవ్రతతో ఉండేవాడని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి గురించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫామ్లో లేకపోయినప్పటికీ కోహ్లిని తక్కువగా అంచనా వేయొద్దని పాంటింగ్ తెలిపాడు.

విరాట్ కోహ్లి గురించి గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పానని, గొప్ప ఆటగాళ్ల సామర్థ్యంపై ఎప్పుడూ ప్రశ్నించకూడదని రికీ పాంటింగ్ అన్నాడు. దిగ్గజ ఆటగాళ్లలో విరాట్ ఒక్కడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం కోహ్లికి ఎంతో ఇష్టమని, ఈ సిరీస్తో తిరిగి లయను అందుకుంటాడని తెలిపాడు. ఆసీస్పై కోహ్లికి మెరుగైన రికార్డు ఉందని గుర్తుచేశాడు. అయితే గత అయిదేళ్లలో టెస్టుల్లో కోహ్లి రెండు టెస్టులే సాధించడం ఆందోళనకర విషయమని అన్నాడు. కోహ్లి స్థానంలో ఇదే ఫామ్ మరో బ్యాటర్కు ఉంటే అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం దక్కేది కాదని పేర్కొన్నాడు.
కోహ్లి గత 10 ఇన్నింగ్స్ల్లో 21.33 సగటుతో 192 పరుగులే చేశాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అయిదు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాగా, 2018/19తో పాటు 2020/21 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజేతగా నిలిచింది. ఇక 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే విజయం సాధిస్తోంది.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్
డిసెంబర్ 06-10: రెండో టెస్టు- అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ.