
సిడ్నీ: బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) పదో సీజన్ సందర్భంగా 2021లో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో కలిసి వ్యాఖ్యానం చేయబోతున్నట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని పాంటింగ్ ట్విటర్లో వెల్లడిస్తూ.. లారాతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. బీబీఎల్ 10 సందర్భంగా కామెంటరీ బాక్సులో ఇద్దరూ కలిసి కుర్చీలో కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు. ఆసీస్ గడ్డపై బీబీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే.
'అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021లో మొదటిసారి బ్రియాన్ లారాతో కలిసి కామెంటరీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది' అని రికీ పాంటింగ్ ట్వీట్ చేశాడు. బీబీఎల్ 10 అనే హాష్ ట్యాగ్ దానికి జతచేశాడు. 2020 డిసెంబర్ 10న ఆరంభమైన బీబీఎల్ పదో సీజన్ 2021 ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ప్రస్తుతం బీబీఎల్ రంజుగా సాగుతోంది. సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్, హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ జట్లు వరుస విజయాలను అందుకుంటున్నాయి.
బ్రియాన్ లారా పేరుపై ఇప్పటికీ ఎన్నో రికార్డులు అలానే ఉన్నాయి. దశాబ్దన్నర కాలమైనా ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటి వరకూ ఏ ఆటగాడు కూడా కనీసం ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేదు. సంప్రదాయం ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400 పరుగులు. అసాధ్యమైన ఈ రికార్డు విండీస్ వీరుడు సుసాధ్యం చేశాడు. 2003లో సెయింట్ జాన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో లారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
క్రికెట్ చరిత్రలో రికీ పాంటింగ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అతడు సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. పాంటింగ్ ఆస్ట్రేలియాకు 2003, 2007 వన్డే ప్రపంచకప్లు అందించాడు. ఇక పాంటింగ్ మూడు ఫార్మాట్లలో 324 మ్యాచ్ల్లో జట్టును నడిపించగా.. ఆసీస్ 220 విజయాలందుకొని, 77 మ్యాచ్ల్లో ఓడింది. 2 టై కాగా.. 13 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి.