
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్టు టెస్టు మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులు పూర్తవగానే ఈ రెండు జట్లు వన్డే సిరీస్ ఆడతాయి. ఈ సిరీస్ షెడ్యూల్ కూడా వెలువడింది. అయితే ఈ సిరీస్లో ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఎందుకంటే ఆసీస్ స్టార్ పేసర్ ఝై రిచర్డ్సన్ గాయం కారణంగా భారత్తో సిరీస్కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బ్యాష్ లీగ్ (బీబీఎల్) ఆడుతున్న సమంయలో రిచర్డ్సన్ గాయపడ్డాడు.
ఆ తర్వాత కొంత కాలం ఆటకు దూరమయ్యాడు. దేశవాళీల్లో కూడా అతను ఆడలేదు. అయినా సరే భారత్లో జరిగే వన్డే సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం కోసం ఒక క్లబ్ మ్యాచ్ ఆడేందుకు బరిలో దిగాడు. కానీ ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లే వేశాడు. ఆ వెంటనే ఫిజియోను కలిసి తనకు ఇంకా హ్యామ్స్ట్రింగ్ నొప్పిగానే ఉందన్నాడు. ఈ నేపథ్యంలో అతనికి మరిన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. రిచర్డ్సన్కు విశ్రాంతి కావాలని నిర్ధారించారు. ఈ క్రమంలో అతను భారత్తో జరిగే వన్డే సిరీసుకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

అలాగే మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్లో కూడా రిచర్డ్సన్ ఆడటం అనుమానంగా మారింది. గతేడాది భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్.. మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసేసింది. ఈ క్రమంలో అతన్ని బేస్ ధర రూ.1.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అసలే ఈసారి ఐపీఎల్లో బుమ్రా ఆడేలా కనిపించడం లేదు. ఇప్పుడు రిచర్డ్సన్ కూడా ఆడకపోతే ముంబై ఇండియన్స్కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.