INDW vs AUSW: మహిళా ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో భారత జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అనేక తప్పిదాలు చేసింది. దీని కారణంగా ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని కూడా సులభంగా ఛేదించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా టీమిండియాకు అనేక అవకాశాలు ఇచ్చింది. కానీ భారత ఫీల్డర్లు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలో రిచా ఘోష్ కూడా ఓ తప్పు చేసింది.
రిచా ఘోష్ చేసిన తప్పేమిటి?
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రిచా ఘోష్ మొదట బ్యాటింగ్లో నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో ఆమెకు మంచి ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును పెద్ద స్కోరుకు చేర్చే అవకాశం ఉన్నా ఆమె అలా చేయలేకపోయింది. ఆ తర్వాత వికెట్ కీపింగ్లో కూడా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సులభమైన స్టంపింగ్ను ఆమె మిస్ చేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ ఈ మ్యాచ్ లో 39 బంతుల్లో 40 పరుగులు చేసింది. దీని కారణంగా ఆస్ట్రేలియాకు చాలా వేగవంతమైన ఆరంభం లభించింది.

మ్యాచ్ వివరాలిలా..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 80), ప్రతీక రావల్(96 బంతుల్లో 75) మొదటి వికెట్కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. దీని ఆధారంగా భారత్ ఆస్ట్రేలియాకు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టీమిండియా నిర్ణీత 50 ఓవర్లు బ్యాటింగ్ చేయలేక.. 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు, కేవలం 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల ఛేదన రికార్డును నెలకొల్పింది. ప్రపంచకప్లో భారత్కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ పరాజయంతో టీమ్ ఇండియాకు సెమీఫైనల్ చేరుకునే మార్గం మరింత కష్టంగా మారినట్లు కనిపిస్తోంది.