న్యూఢిల్లీ: తన పెళ్లికి భారత్ వన్డే, టీ20 కెప్టెన్ ధోనిని, సురేష్ రైనాని పిలవకపోవడంపై టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. ఈ నెల 17వ తేదీన రవీంద్ర జడేజా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లికి ధోనీ, సురేష్ రైనాలను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని జడేజా అన్నారు.
ఎందుకంటే వాళ్లిద్దరూ తనకు ఆప్తమిత్రులని, అందుకే వారిని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని ఈ ఆల్ రౌండర్ తెలిపాడు. ఒక బెంగాలీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా ఈ విషయాన్ని వెల్లడించాడు. వాళ్లిద్దరూ తన పెళ్లికి తప్పకుండా వస్తారని తెలిపాడు.
యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతోన్న మెకానికల్ ఇంజినీర్ అయిన రీవా సొలంకిని రవీంద్ర జడేజా ఈ నెల 17వ తేదీన పెళ్లి చేసుకోనున్నాడు. జడేజా పెళ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్ మధ్యలో జరగనుంది. సోలంకీ ఢిల్లీలోని ఆత్మీయ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.

రాజ్కోట్లో బిజినెస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్దేవ్సింగ్ సోలంకీ కూతురే రీవా సోలంకీ. రీవా తల్లి ప్రఫుల్లాబా సొలంకీ.. ఇండియన్ రైల్వేలో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఇదిలా ఉంటే పెళ్లికి ముందే కాబోయే అల్లుడికి జడేజా అత్తింటివారు భారీ కానుకను అందించారు.
సోలంకీతో రవీంద్ర జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగింది. రూ. 97లక్షల విలువచేసే ఆడీ క్యూ7 కారును జడేజా మామ హర్దేవ్సింహ్ సోలంకీ కాబోయే అల్లుడికి బహుమతిగా ఇచ్చారు. రవీంద్ర జడేజా సోమవారం తన కాబోయే భార్య రివాబా సోలంకీతో కలిసి వెళ్లి స్థానిక షోరూం నుంచి కారు తెచ్చుకున్నారు.